మాక్సీపైనే ఆర్‌సీబీ గురి..కారణమదే: గంభీర్‌

ఐపీఎల్‌ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌పై రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆసక్తి చూపుతుందని టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌పై భారాన్ని....

Published : 18 Feb 2021 02:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌పై రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆసక్తి చూపుతుందని టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌పై భారాన్ని తగ్గించడానికి మాక్సీ వంటి ఆటగాడు ఆ జట్టుకు చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు. చెన్నై వేదికగా గురువారం జరగనున్న వేలం గురించి ఓ కార్యక్రమంలో గంభీర్‌ మాట్లాడాడు.

‘‘మాక్స్‌వెల్ వంటి క్రికెటర్‌ కోసం ఆర్‌సీబీ ఆసక్తి చూపుతుంది. కోహ్లీ, డివిలియర్స్‌పై భారం తగ్గించడం వాళ్లకి అతడు ఎంతో అవసరం. దేవదత్ పడిక్కల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. తర్వాత డివిలియర్స్‌ ఉంటాడు. అయితే ఎక్స్‌-ఫ్యాక్టర్‌ ప్లేయర్‌ మాక్స్‌వెల్‌ ఆ జట్టుకు కావాలి. ఫ్లాట్ వికెట్‌, చిన్నదైన చిన్నస్వామి మైదానంలో అతడు ఎంతో ప్రభావం చూపగలడు. కాబట్టి బెంగళూరు మాక్సీని కోరుకుంటుంది’’ అని పేర్కొన్నాడు.

‘‘అయితే బెంగళూరుకు నాణ్యమైన ఆటగాళ్లు ఎంతో అవసరం. ఎందుకంటే మొయిన్ అలీ, ఉమేశ్‌ యాదవ్ వంటి నాణ్యమైన ప్లేయర్లను ఆ జట్టు వదులుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఫాస్ట్‌ బౌలర్లు ఎక్కువగా లేరు (వేలంలో). నవదీప్‌ సైని, సిరాజ్‌ యువ బౌలర్లు. ఉమేశ్‌ను ఆ జట్టు విడిచిపెట్డడం ఆశ్చర్యంగా అనిపించింది. అయితే ఉమేశ్‌ను పంజాబ్‌ జట్టు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి’’ అని గంభీర్‌ వెల్లడించాడు.

‘‘భారత బౌలర్లను దక్కించుకోవాలని పంజాబ్ ఆశిస్తుంటుంది. ఎందుకంటే మహ్మద్‌ షమికి ఇతర బౌలర్ల నుంచి సహకారం దక్కట్లేదు. ఉమేశ్‌-షమి కొత్తబంతిని పంచుకోవొచ్చు. కొత్తబంతిని పంచుకోవడానికి ఇద్దరు భారత ఫాస్ట్‌బౌలర్లు ఉంటే మరో విదేశీ ఆటగాడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే పంజాబ్‌ జట్టులో క్రిస్‌ మోరిస్‌ వంటి ఆటగాడు ఉంటే డెత్‌ ఓవర్లలో ప్రత్యర్థి కట్టడి చేయవచ్చు. అలాగే జేమిసన్‌పై కూడా పంజాబ్‌ ఆసక్తి చూపించవచ్చు’’ అని అన్నాడు. అదే కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రా మాట్లాడుతూ వేలంలో షకిబ్‌ అల్ హసన్‌ అధిక ధర పలుకుతాడని పేర్కొనగా.. మాక్స్‌వెల్‌ ప్రభావితం చూపిస్తాడని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని