కోపా అమెరికా టోర్నీ విజేతగా అర్జెంటీనా

కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీని అర్జెంటీనా గెలుపొందింది. టోర్నీ ఫైనల్‌లో బ్రెజిల్‌పై విజయం సాధించింది.

Updated : 11 Jul 2021 10:05 IST

(ఫొటో సోర్స్‌: కోపా అమెరికా ట్విటర్‌)

వాషింగ్టన్‌: ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు శనివారం రాత్రి కోపా అమెరికా టైటిల్‌ కైవసం చేసుకుంది. బ్రెజిల్‌తో తలపడిన ఫైనల్లో అర్జెంటీనా 1-0 తేడాతో గెలుపొందింది. దాంతో అర్జెంటీనా 28 ఏళ్ల తర్వాత అతిపెద్ద టైటిల్‌ సాధించింది. మరోవైపు మెస్సీకి ఈ విజయం అంతర్జాతీయ టోర్నీల్లో అతిపెద్దది కావడం గమనార్హం. ఈ విజయంతో అర్జెంటీనా అత్యధిక టైటిళ్లు (15) సాధించిన ఉరుగ్వే సరసన నిలిచింది. 1993 తర్వాత ఆ జట్టు కోపా అమెరికా టోర్నీని గెలవడం ఇదే తొలిసారి. ఈ ఫైనల్లో అర్జంటీనా ఆటగాడు ఏంజిల్‌ డి మారియా 22వ నిమిషంలో గోల్‌ చేయడంతో ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

మరోవైపు మెస్సీ కూడా 88వ నిమిషంలో ఓ గోల్‌ చేయడానికి ప్రయత్నించినా ప్రత్యర్థి జట్టు గోల్‌కీపర్‌ ఎడర్సన్‌ దాన్ని అడ్డుకున్నాడు. దాంతో ఫైనల్లో ఈ స్టార్‌ ప్లేయర్‌ గోల్‌ చేయలేకపోయాడు. మొత్తంగా ఈ టోర్నీలో మెస్సీ నాలుగు గోల్స్‌ సాధించి బ్రెజిల్‌ స్టార్‌ నెయ్‌మర్‌తో సమానంగా నిలిచాడు. వీరిద్దర్నీ అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎంపికచేశారు. ఏకైక గోల్‌ సాధించిన  ఏంజిల్‌ డి మారియా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇక మ్యాచ్‌ పూర్తయ్యే సమయానికి అర్జెంటీనాను విజేతగా ప్రకటించగా మెస్సీ ఉద్వేగానికిలోనయ్యాడు. సంతోషంతో ఆనందబాష్పాలు రాల్చాడు. ఇక ఆ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెస్సీని గాల్లోకి ఎగరవేస్తూ సంబరాలు చేసుకున్నారు.

(ఫొటో సోర్స్‌: కోపా అమెరికా ట్విటర్‌)



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని