Hyderabad Cricket Association: క్రికెట్‌తో ఆటలు

హైదరాబాద్‌ అంటే ఇప్పటి తరానికి గుర్తొచ్చేది బిర్యానీ. కాని ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే క్రికెట్‌.. క్రికెట్‌ అంటే హైదరాబాద్‌. బ్యాటింగ్‌ మణికట్టు మాయాజాలానికి పెట్టింది పేరు.

Updated : 22 Oct 2021 07:09 IST

హైదరాబాద్‌ అంటే ఇప్పటి తరానికి గుర్తొచ్చేది బిర్యానీ. కాని ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే క్రికెట్‌.. క్రికెట్‌ అంటే హైదరాబాద్‌. బ్యాటింగ్‌ మణికట్టు మాయాజాలానికి పెట్టింది పేరు. ఎం.ఎల్‌.జయసింహ, మహ్మద్‌ అజహరుద్దీన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ వంటి ప్రపంచ మేటి మణికట్టు బ్యాటింగ్‌ మాంత్రికుల్ని అందించిన గడ్డ. అంతటి ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్‌ క్రికెట్‌ కొన్నేళ్లుగా గాడి తప్పింది. పరిపాలకుల అవినీతి, అక్రమాలు, అంతర్గత కుమ్ములాటలతో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అప్రతిష్ట మూటగట్టుకుంది. ప్రస్తుత పాలకుల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకోవడంతో హైదరాబాద్‌ క్రికెట్‌ ప్రభ పూర్తిగా మసకబారింది.

ఈనాడు - హైదరాబాద్‌

‘హెచ్‌సీఏ అంటేనే అవినీతికి చిరునామా’ అన్నది క్రికెట్‌ వర్గాల్లో వినిపించే మాట. 2003లో ఉప్పల్‌ స్టేడియం నిర్మాణంతో హెచ్‌సీఏలో అవినీతికి బీజం పడింది. అప్పుడు మొదలైన మేత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సుమారు రూ.35 కోట్లతో మొదలుపెట్టిన స్టేడియం నిర్మాణం రూ.100 కోట్లు దాటేసింది. ఉప్పల్‌ మైదానం తర్వాత నిర్మాణాలు చేపట్టిన వేరే రాష్ట్ర సంఘాలు రూ.50 కోట్లతోనే అత్యాధునిక స్టేడియాలు పూర్తి చేయడం విశేషం. మరోవైపు ఉప్పల్‌ స్టేడియం ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండటం మరో విశేషం! స్టేడియం పేరుతో ఏదో ఒక అభివృద్ధి పని చేపట్టడం.. డబ్బులు దండుకోవడం పదవిలో ఉన్న కార్యవర్గ సభ్యులకు అలవాటుగా మారింది. దాంతోపాటు హైదరాబాద్‌ రంజీ ట్రోఫీ, అండర్‌-23, అండర్‌-19, అండర్‌-16, అండర్‌-14 జట్లలో ఆటగాళ్ల ఎంపికకు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తుండటం బహిరంగ రహస్యం! ఎ-డివిజన్‌లోని హెచ్‌సీఏ క్లబ్‌లను లక్షల్లో అద్దెకివ్వడం.. ఆటగాళ్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ లీగ్‌లలో ఆడిస్తుండటం అందరికీ తెలిసిందే. మొత్తంగా క్రికెట్‌ను అన్ని విధాలుగా భ్రష్టుపట్టించిన ఘనత హెచ్‌సీఏ పూర్వ, ప్రస్తుత పాలకులదే.

‘‘గత 25 ఏళ్లుగా బీసీసీఐ నుంచి వస్తున్న నిధులు ఎక్కడికి వెళ్లాయి?’’ అంటూ ప్రశ్నించి, 2019 సెప్టెంబరులో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన అజహరుద్దీన్‌ అద్భుతాలు చేస్తాడని ఎవరూ ఊహించలేదు! కాకపోతే టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌గా.. క్రికెట్‌, ఆటగాళ్ల కష్టాల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా ఆటకు అంతో ఇంతో మేలు జరుగుతుందని ఆశించిన వాళ్లు ఎంతోమంది. భారీ మెజారిటీతో గెలిచిన అజహర్‌ వర్గంలో అభిప్రాయ భేదాలు రావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. అపెక్స్‌ కౌన్సిల్‌ రెండుగా చీలిపోయింది. అధ్యక్షుడు అజహర్‌ ఒకవైపు.. కార్యదర్శి విజయానంద్‌, ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌, సంయుక్త కార్యదర్శి నరేశ్‌శర్మ, కోశాధికారి సురేందర్‌ అగర్వాల్‌, కౌన్సిలర్‌ అనురాధ మరోవైపు. ఇరువర్గాల మధ్య కుమ్ములాటలతో ఆట అటకెక్కింది. 2019-20 రంజీ సీజన్‌లో హైదరాబాద్‌ 8 లీగ్‌ మ్యాచ్‌ల్లో ఆరింట్లో ఓడింది. మిగతా వయో పరిమితి జట్లూ వైఫల్యాల బాటలో పయనించాయి. అధ్యక్షుడు.. అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుల మధ్య ప్రతిరోజూ గొడవే. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకం అధ్యక్షుడు.. అపెక్స్‌ కౌన్సిల్‌ మధ్య చిచ్చు రాజేసింది. జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకం కోసం అజహర్‌ పట్టుబట్టగా.. మిగతా వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. చివరికి ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన హెచ్‌సీఏ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) వివాదాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఏజీఎంలో హెచ్‌సీఏ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. నువ్వు ఫిక్సర్‌ అంటూ ఒకరు.. నువ్వు దొంగ, మోసగాడివి అంటూ మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. రసాభాసగా జరిగిన ఏజీఎంలో జస్టిస్‌ దీపక్‌వర్మను అంబుడ్స్‌మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించి అజహర్‌ వెళ్లిపోయాడు. అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు మాత్రం జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూను అంబుడ్స్‌మన్‌గా.. జస్టిస్‌ మీనాకుమారిని ఎథిక్స్‌ అధికారి నియమిస్తున్నట్లు ప్రకటించారు. హెచ్‌సీఏకు అసలు అంబుడ్స్‌మన్‌ ఎవరో తెలియక ఆటగాళ్లు, క్రికెట్‌ అభిమానులు తలలు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు.

అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు జస్టిస్‌ దీపక్‌వర్మ ప్రకటించడంతో అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ కక్రూ, జస్టిస్‌ మీనాకుమారిలను ఏజీఎం నియమించిందంటూ వాదించారు. అజహర్‌ను అపెక్స్‌ కౌన్సిల్‌ సస్పెండ్‌ చేసింది. అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులపై జస్టిస్‌ దీపక్‌ వర్మ వేటువేశారు. హైకోర్టులో ఒకసారి అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు ఊరట లభించింది. మరోసారి అజహర్‌కు అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. ఇలా ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ.. గొడవలు పడుతూ ఆటను పూర్తిగా గాలికొదిలేశారు. దీంతో హెచ్‌సీఏ పూర్తిగా గాడి తప్పిందని భావించిన బీసీసీఐ.. ఉప్పల్‌ స్టేడియానికి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా కేటాయించలేదు. నవంబరు నుంచి జూన్‌ వరకు సొంతగడ్డపై న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికాలతో 21 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగనుండగా.. హైదరాబాద్‌కు ఒక్కటీ ఇవ్వకపోవడం బీసీసీఐ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకటైన హెచ్‌సీఏకు ఘోరమైన అవమానం.

స్టేడియం నిర్మాణంలో అవినీతి.. అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణలో అక్రమాలు.. జట్ల ఎంపికలో పక్షపాతం, లంచాలతో హెచ్‌సీఏ పెద్దలు అవినీతిలో రికార్డులు సృష్టించారు. ఈ అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) లోతైన విచారణ జరిపినా ఇప్పటి వరకు చర్యలు శూన్యం! అవినీతి జరిగిందని తేలినా ఏ ఒక్కరికీ శిక్ష పడలేదు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కేసు కొనసాగుతూనే ఉంది. ఇక హెచ్‌సీఏను, హైదరాబాద్‌ క్రికెట్‌ను ఎవరూ బాగు చేయలేరని అనుకుంటున్న సమయంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వ్యాఖ్యలు క్రికెట్‌ వర్గాల్లో కొత్త ఆశల్ని రేకెత్తించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని