Team India: వేళ్లన్నీ ఐపీఎల్‌ వైపే!

‘‘భారత్‌ వైఫల్యానికి కారణం ఐపీఎలే’’.. ‘‘భారత క్రికెట్‌కు ఐపీఎల్‌ మంచిది కాదు’’.. ‘‘ఈ లీగ్‌ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ’’.. ‘‘వెంటనే ఐపీఎల్‌ను నిషేధించాలి’’.. ఇవీ టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించే ముప్పు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వినిపిస్తున్న మాటలు.

Updated : 02 Nov 2021 07:05 IST

ఈనాడు క్రీడావిభాగం

‘‘భారత్‌ వైఫల్యానికి కారణం ఐపీఎలే’’.. ‘‘భారత క్రికెట్‌కు ఐపీఎల్‌ మంచిది కాదు’’.. ‘‘ఈ లీగ్‌ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ’’.. ‘‘వెంటనే ఐపీఎల్‌ను నిషేధించాలి’’.. ఇవీ టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించే ముప్పు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వినిపిస్తున్న మాటలు. కోహ్లీసేన ప్రదర్శనతో తీవ్ర నిరాశలో ఉన్న క్రికెట్‌ ప్రేమికులు.. జట్టు వైఫల్యానికి ఐపీఎల్‌ను నిందిస్తున్నారు. కొందరు క్రికెట్‌ విశ్లేషకులు, మాజీలు సైతం ఐపీఎల్‌ వైపు వేళ్లు చూపిస్తున్నారు. నిజంగా ఈ వైఫల్యానికి ఐపీఎల్‌దే బాధ్యతా? ఈ లీగ్‌ వల్ల భారత క్రికెట్‌కు అంత నష్టమా?

బలమైన జట్టుతో బరిలో దిగి రెండోసారి టీ20 ప్రపంచకప్పును అందుకుంటుందనుకున్న టీమ్‌ఇండియా ఉసూరుమనిపించింది. పేలవ ఆటతీరుతో అభిమానులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ చేతితో చావుదెబ్బ తిన్న జట్టు.. కివీస్‌తో మ్యాచ్‌లోనైనా పుంజుకుంటుందని అంతా ఆశించారు. కానీ ఓటమి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోని కోహ్లీసేన మరోసారి అవే తప్పులు చేసి మూల్యం చెల్లించుకుంది. ఈ ప్రపంచకప్‌లో రాత్రిపూట మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ కఠినంగా ఉంటోంది. అప్పటికే పాక్‌తో మ్యాచ్‌లో ఆ విషయం టీమ్‌ఇండియాకూ అర్థమైంది. కానీ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ మరోసారి బ్యాటింగ్‌లో జట్టు పూర్తిగా విఫలమైంది. గాల్లోకి బంతి లేపకుండా కింది నుంచి ఆడుతూ ఒక్కో పరుగు తీస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేయకుండా లాఫ్టెడ్‌ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. కుర్రాళ్లు.. సీనియర్లు అనే తేడా లేకుండా అందరిదీ అదే దారి. ఆడితే డాట్‌ బాల్స్‌ లేదంటే షాట్లు అన్నట్లు బ్యాటింగ్‌ చేశారు. ఈ విధమైన ఆటతీరుకు ప్రధాన కారణం ఐపీఎల్‌ అంటూ ఇప్పుడందరూ ఆ లీగ్‌ను విమర్శిస్తున్నారు.

తప్పు లేకపోలేదు..: ఈ ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా పేలవ ప్రదర్శనకు కొంతమేర ఐపీఎల్‌ కారణం కాకుండా ఏమీ లేదు. వచ్చామా.. పిచ్‌, పరిస్థితులు, బౌలర్ల గురించి ఆలోచించకుండా బాదామా అన్నట్లు ఆడే తీరు ఐపీఎల్‌తోనే అలవాటైంది మన వాళ్లకు. ఈ లీగ్‌ వల్ల బ్యాటింగ్‌ విధానమే పూర్తిగా మారిపోయింది. కేవలం ధనాధన్‌ బ్యాటింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. పరిస్థితులకు తగ్గట్లు ఆచితూచి జాగ్రత్తగా ఆడాలనే ఉద్దేశమే వాళ్లకు లేదు. షాట్లు కొట్టాలనే తొందరపాటు కనిపిస్తోంది. ఐపీఎల్‌ ప్రదర్శనతో టీమ్‌ఇండియాలోకి వచ్చిన ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ అదే వైఖరి అనుసరిస్తున్నారు. కొన్నిసార్లు దూకుడుగా ఆడడం మేలు చేస్తుందేమో కానీ అన్ని సార్లూ పరిస్థితులకు తగ్గట్లు ఆడడం ముఖ్యం. బంతిని గాల్లోకి లేపడం కంటే.. గ్రౌండ్‌ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును కదిలించడం కీలకం. కానీ అలా చేయడంలో భారత ఆటగాళ్లు విఫలమయ్యారు. మ్యాచ్‌ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయారు. అందుకు తగినట్లు తమ ఆటను అన్వయించుకోలేకపోయారు. సోమవారం శ్రీలంకతో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కూడా మొదట బ్యాటింగ్‌ చేసి ఇబ్బంది పడింది. కానీ ప్రతికూల పరిస్థితుల్లో బట్లర్‌ ఆచితూచి ఆడాడు. ఓ భాగస్వామ్యం నెలకొల్పాక చెలరేగాడు. అతను విధ్వంసక బ్యాట్స్‌మనే అయినా పరిస్థితులకు తగ్గట్లు అన్వయించుకున్న తీరు అమోఘం. భారత ఆటగాళ్లు ఇక్కడే విఫలమయ్యారు. కేవలం భారీ షాట్లు మాత్రమే ఆడాలన్న వాళ్ల ఆలోచనకు కారణం కొంతమేర ఐపీఎల్‌ అనడంలో సందేహం లేదు. ఇక ఈ ప్రపంచకప్‌లో పిచ్‌లు ఇలా స్లోగా మారడంలోనూ ఐపీఎల్‌ పాత్ర ఉంది. ఈ కప్పుకు ముందు ఇదే వేదికల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగాయి. దీంతో జీవం కోల్పోయిన పిచ్‌లు ఇప్పుడు నెమ్మదిగా స్పందిస్తూ.. మ్యాచ్‌లను ఏకపక్షంగా మార్చేస్తున్నాయి. టాస్‌ గెలిస్తే మ్యాచ్‌ సొంతమవుతుందనే పరిస్థితికి ఇదే కారణం. ఐపీఎల్‌ రెండో దశ మ్యాచ్‌లు నిర్వహించిన సమయం, వేదిక సరికాదనే వాదన ఉంది.

ఆ అలసటకు..: నెలల పాటు కుటుంబాలకు దూరంగా బుడగలో ఉండడం వల్ల అలసట చెందుతున్నామని, మానసికంగా ఆటగాళ్లపై ఆ ప్రభావం పడుతుందని టీమ్‌ఇండియా పేసర్‌ బుమ్రా అభిప్రాయపడ్డాడు. ఆ ఆటగాళ్ల అలసటకు ఐపీఎల్‌ కూడా ఓ కారణమే. ఈ ఏడాది ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఏప్రిల్‌ 9న భారత్‌లో ఆరంభమైంది. కానీ ఆ తర్వాత బబుల్‌లో ఉన్న ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో మే 4న సీజన్‌ను అర్ధంతరంగా వాయిదా వేశారు. మిగిలిన మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకూ నిర్వహించారు. మరోవైపు కివీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో సిరీస్‌ కోసం జూన్‌లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ వెళ్లింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత భారత ఆటగాళ్లకు మూడు వారాల పాటు విరామం దొరికింది. కానీ ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో సిరీస్‌ మొదలైంది. మరోసారి కరోనా భయంతో చివరి టెస్టు రద్దవడంతో ఇంగ్లాండ్‌ నుంచి ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం నేరుగా యూఏఈకే వచ్చారు. ఐపీఎల్‌- 14 ఫైనల్‌ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టారు. ఇలా జూన్‌ నుంచి టీమ్‌ఇండియా.. బబుల్‌లోనే గడుపుతోంది. ఆ విషయం తెలిసి కూడా ఆటగాళ్లకు టీ20 ప్రపంచకప్‌ ముందు విశ్రాంతి ఇద్దామనే ఆలోచన కూడా చేయకుండా మధ్యలో దొరికిన విరామంలో ఐపీఎల్‌ రెండో అంచె మ్యాచ్‌లు నిర్వహించారు. ఈ ప్రపంచకప్‌నకు ముందు ఐపీఎల్‌ నిర్వహించడం కూడా ఆటగాళ్ల అలసటకు కారణమైంది.


నిందించడం సరైందేనా?

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వైఫల్యానికి ఐపీఎల్‌ ఓ కారణం కావొచ్చు. కానీ ఐపీఎల్‌ను మొత్తానికే నిషేధించాలనడం సరైందేనా అన్నది ప్రశ్న. ఇప్పుడు ఎవరైతే ఐపీఎల్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నారో.. వాళ్లే తిరిగి ఐపీఎల్‌ మరో సీజన్‌ ఆరంభమైందంటే చాలు లీగ్‌లో మునిగి తేలుతారు. ఈ లీగ్‌ ద్వారానే ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారనే విషయాన్ని మర్చిపోకూడదు. సత్తా ఉన్న దేశవాళీ ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఐపీఎల్‌ ఓ గొప్ప వారధిగా మారింది. బుమ్రా సహా ఎంతోమంది క్రికెటర్లు టీమ్‌ఇండియాకు ఆడుతున్నారంటే అందుకు ఐపీఎల్‌ కారణం. ఇప్పుడు ఐపీఎల్‌ అంటే కేవలం లీగ్‌ మాత్రమే కాదు.. అంతకుమించి. ప్రపంచ క్రికెట్లో అది అత్యున్నత స్థానంలో ఉంది. ఒకే సారి అటు ఇంగ్లాండ్‌లో.. ఇటు శ్రీలంకలో భారత్‌కు చెందిన రెండు క్రికెట్‌ జట్లు సిరీస్‌లు ఆడాయంటే.. జట్టు బలం అంతలా పెరిగిందంటే అందుకు ఐపీఎల్‌ కారణం. మరోవైపు బీసీసీఐకి లీగ్‌ కాసుల పంట పండిస్తోంది. ఆ డబ్బుతో బీసీసీఐ.. దేశవాళీ క్రికెట్‌ టోర్నీలు నిర్వహించడంతో పాటు యువ ఆటగాళ్లకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇటు ఆదాయం.. అటు ఆటగాళ్లకు గుర్తింపు అందిస్తున్న ఐపీఎల్‌ను ఇప్పుడు జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చూపడం ఎంతవరకూ సమంజసం?


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని