Nikhat Zareen: రింగ్‌లో సివంగి

13 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి బాక్సింగ్‌లో తలపడుతున్న అబ్బాయిలను చూసింది. కానీ అక్కడ తనకు బాక్సింగ్‌ చేస్తున్న ఆడపిల్లలు కనిపించలేదు. అమ్మాయిలు ఎందుకు బాక్సింగ్‌ చేయడం లేదంటూ తండ్రిని అడిగింది. వాళ్లకు బలం తక్కువగా...

Updated : 20 May 2022 06:44 IST

ఈనాడు - హైదరాబాద్‌, నిజామాబాద్‌

13 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి బాక్సింగ్‌లో తలపడుతున్న అబ్బాయిలను చూసింది. కానీ అక్కడ తనకు బాక్సింగ్‌ చేస్తున్న ఆడపిల్లలు కనిపించలేదు. అమ్మాయిలు ఎందుకు బాక్సింగ్‌ చేయడం లేదంటూ తండ్రిని అడిగింది. వాళ్లకు బలం తక్కువగా ఉంటుంది కదా అని ఆయన నవ్వుతూ బదులిచ్చాడు. బాక్సింగ్‌లో మహిళల బలాన్ని చాటాలని అప్పుడే ఆ అమ్మాయి నిర్ణయించుకుంది. చేతులకు గ్లౌజులు తొడిగి రింగ్‌లో అడుగుపెట్టింది. కానీ సాధన చేద్దామంటే.. మరే అమ్మాయి కూడా లేదు. అందుకే అబ్బాయిలతో కలిసే ప్రాక్టీస్‌ చేసింది. దెబ్బలు తిన్నది. తిరిగి ధైర్యంగా నిలబడింది. పోరాటాన్నే నమ్ముకుంది. ఆ అమ్మాయే.. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్‌ జరీన్‌. నిజామాబాద్‌లోని మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. ప్రపంచ ఛాంపియన్‌ టైటిల్‌ నెగ్గే దిశగా సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం.

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగమ్మాయి.. మొత్తం మీద భారత అయిదో బాక్సర్‌.. ఇదీ ఇప్పుడు మన నిఖత్‌ జరీన్‌ రికార్డు. ఆమె సాధించిన విజయంతో దేశం ఉప్పొంగిపోతోంది. ఇప్పుడామె గెలుపు గొప్ప కిక్కునిస్తోంది. కానీ ఇక్కడివరకూ ఆమె ప్రయాణం ఎన్నో ఒడుదొడుకులతో సాగింది. సవాళ్ల బాటలోనే ఆమె సవారీ చేసింది. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా.. అడ్డంకులు పలకరించినా.. బాక్సింగ్‌పై ప్రేమను వదులుకోలేదు. రింగ్‌లో ప్రత్యర్థులతో.. బయట సవాళ్లతో పోరాడింది. రెండు చోట్లా విజయాలు సాధించి అస్సలు తగ్గేదేలే అని చాటింది. అడుగడుగునా అడ్డంకులు.. వేలాకోళాలు.. విమర్శలతో ఎదురు దాడి.. ఎగతాళి వ్యాఖ్యలు.. కానీ ఆమె ఆగలేదు. రింగ్‌లో సివంగిలా.. ప్రత్యర్థులకు సింహస్వప్నంలా.. పంచ్‌లతో చెలరేగి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఆరంభం నుంచే..: నిఖత్‌ చిన్నతనం నుంచే చాలా చురుగ్గా ఉండేది. ఆటలంటే ఇష్టం పెంచుకుంది. పాఠశాల స్థాయిలో అథ్లెటిక్స్‌లో మెరిసింది. అయితే అమ్మాయిలు ఎందుకు బాక్సింగ్‌ చేయకూడదు అనే ప్రశ్నతో తన జీవితమే మారిపోయింది. ఆమె అడుగులు బాక్సింగ్‌ వైపు పడ్డాయి. అప్పుడే సవాళ్లూ స్వాగతించాయి. ముందుగా రింగ్‌ బయటే ఆమెకు అడ్డంకులు ఏర్పడ్డాయి. కుటంబ కట్టుబాట్లు ఓ వైపు.. ఆడపిల్లకు బాక్సింగ్‌ ఎందుకంటూ వినిపించే మాటాలు మరోవైపు.. ముఖం మీద గాయాలైతే ఎవరూ పెళ్లి చేసుకోరనే వ్యాఖ్యలు ఇంకోవైపు. ఇలా ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆమె ఆగలేదు. తండ్రి మహమ్మద్‌ జమీల్‌ అహ్మద్‌ ఆమెకు అండగా నిలిచాడు. తనయను ఛాంపియన్‌గా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అబ్బాయిలతోనే కలిసి ఆమె ప్రాక్టీస్‌ చేసేది. వాళ్లతోనే తలపడేది. షంసముద్దీన్‌ (బాక్సర్‌ మహమ్మద్‌ హుసాముద్దీన్‌ తండ్రి) దగ్గర శిక్షణ తీసుకునేది. షార్ట్‌లు, స్లీవ్‌లెస్‌ టాప్స్‌ వేసుకుని ప్రాక్టీస్‌ చేయాల్సి రావడంతో ఓ వర్గం నుంచి నిఖత్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ తండ్రి ప్రోత్సాహంతో ఆమె ముందుకు సాగింది. సంప్రదాయాలు..కట్టుబాట్ల విషయాల్లో ఎదురయ్యే మాటలు, విమర్శలను వారు లెక్కచేయలేదు.

పడి లేచింది..: క్రీడల్లో రాణించాలంటే పెద్ద పెద్ద నగరాల్లో అత్యుత్తమ వసతుల మధ్య శిక్షణ తీసుకోవాలి అనే మాటలు తప్పని నిఖత్‌ నిరూపించింది. తపన, పట్టుదల, ఆత్మవిశ్వాసం, పోరాట పటిమ ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని చాటిచెప్పింది. నిజామాబాద్‌లోనే అరకొర వసతుల మధ్య సాధన చేసిన ఆమె బాక్సింగ్‌పై పట్టు సాధించింది. రాష్ట్రస్థాయిలో సత్తాచాటింది. 2010 జూనియర్‌ జాతీయ ఛాంపియన్‌షిప్‌లోస్వర్ణంతో అదరగొట్టింది. విశాఖపట్నంలోని సాయ్‌ శిబిరంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వర రావు శిక్షణలో మరింత రాటుదేలింది. 2011లో 15 ఏళ్లకే జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. చిరంజీవి దగ్గర మెళకువలు నేర్చుకుంది. సీˆనియర్‌ స్థాయిలోనూ మెరిసింది. దీంతో భారత బాక్సింగ్‌కు మరో స్టార్‌ దొరికినట్లేనని అంతా అనుకున్నారు. కానీ నిఖత్‌ పోటీపడే 52 కేజీల విభాగంలోనే అప్పటికే దిగ్గజం మేరీకోమ్‌ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోంది. అది తనకు పెద్ద అడ్డంకిగా మారింది. 2018లో భుజం గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉంది. దీంతో నిఖత్‌ గురించి అందరూ మర్చిపోయారు. కానీ పడిలేచిన కెరటంలా ఆమె దూసుకొచ్చింది. అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటింది. కానీ 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు మేరీతో సెలక్షన్‌ ట్రయల్స్‌ పోరు కోసం పట్టుబట్టిన నిఖత్‌ చుట్టూ వివాదం అల్లుకుంది. చివరకు బౌట్లో మేరీ చేతిలో ఆమె ఓడడంతో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. నిఖత్‌ సత్తాను తక్కువ చేస్తూ ఎగతాళి వ్యాఖ్యలు వినిపించాయి. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కుంగిపోకుండా ఉండడం ఎంతో కష్టం. కానీ ఆ సమయంలోనూ మనో నిబ్బరం కోల్పోలేదు. తన లక్ష్యాన్ని అందుకోవాలనే పట్టుదలతో మళ్లీ ఆటపై దృష్టి పెట్టింది. సాధనను మరింత తీవ్ర తరం చేసింది. కొన్ని నెలల పాటు ఎవరికీ కనిపించకుండా.. తన టెక్నిక్‌ను మెరుగుపర్చుకోవడంలో మునిగిపోయింది. ఇప్పుడు తన శ్రమకు ఫలితం దక్కింది. ఈ ఏడాది స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో విజేతగా నిలిచి రెండు సార్లు ఆ పోటీల్లో ఛాంపియన్‌ టైటిల్‌ గెలుచుకున్న తొలి భారత బాక్సర్‌గా రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.
నిఖత్‌ తండ్రి మహమ్మద్‌ జమీల్‌ అహ్మద్‌ జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ ఆడాడు. తనకు నలుగురు తనయలు. నిఖత్‌ మూడో సంతానం. ఆమె చెల్లి ఇంటర్‌ చదువుతూ బ్యాడ్మింటన్‌లో జూనియర్‌ స్థాయిలో రాణిస్తోంది. ఇద్దరు అక్కలు ఫిజియోథెరపిస్ట్‌లు. బల్గేరియాలో శిక్షణలో ఉండి.. పెద్దక్క పెళ్లికి ఆమె రాలేదు. రెండో అక్క పెళ్లికి వచ్చినా.. ఉదయం సాయంత్రం సాధన చేయటం మానలేదు. కరోనా సమయంలోనూ ఫిట్‌నెస్‌ కోసం ఊరు బయట, ఇంటి పైభాగంలో సాధన చేసింది. ఎంబీఏ చదువుతున్న ఆమెకు ఏడాది కిందటే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని