Chess Olympaid: కంచు మోగింది

ఆశించినట్లు పసిడి దక్కకపోయినా.. ప్రదర్శన స్ఫూర్తిదాయకం. చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ మెరిసింది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 44వ ఒలింపియాడ్‌ను...

Updated : 10 Aug 2022 03:11 IST

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు రెండు పతకాలు

ఆశించినట్లు పసిడి దక్కకపోయినా.. ప్రదర్శన స్ఫూర్తిదాయకం. చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ మెరిసింది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 44వ ఒలింపియాడ్‌ను రెండు కంచు పతకాలతో ముగించింది. మహిళల-1, పురుషుల-2 జట్లు పోడియంపై నిలిచాయి. చివరిదైన 11వ రౌండ్లో అనూహ్య ఓటమితో మహిళల-1 జట్టు సువర్ణావకాశాన్ని చేజార్చుకుంటే.. పురుషుల-2 జట్టు విజయంతో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది.

మహాబలిపురం: ఒలింపియాడ్‌లో భారత్‌కు రెండూ కాంస్యాలే. పదో రౌండ్‌ వరకు అగ్రస్థానంలో ఉన్న భారత మహిళల-1 జట్టు మంగళవారం, చివరిదైన 11వ రౌండ్లో 1-3తో అమెరికా చేతిలో ఓడి స్వర్ణాన్ని చేజార్చుకుంది. తొఖిర్‌జొనోవాతో గేమ్‌ను హంపి, ఇరినా కృష్‌తో గేమ్‌ను వైశాలి డ్రాగా ముగించారు. కరీసా ఇప్‌ చేతిలో తానియా, అబ్రహమ్యాన్‌ చేతిలో భక్తి కులకర్ణి ఓడిపోవడం భారత్‌ను దెబ్బతీసింది. చెస్‌ ఒలింపియాడ్‌ మహిళల విభాగంలో పతకం సాధించడం భారత్‌కు ఇదే తొలిసారి. మరోవైపు వంతిక, పద్మిని రౌత్‌, మేరీ ఆన్‌ గోమ్స్‌, దివ్యలతో కూడిన భారత్‌-2 ఎనిమిదో స్థానం సాధించగా.. భారత్‌-3 (ఈషా, నందిద, సాహితి, ప్రత్యూష) 17వ స్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌ స్వర్ణం గెలుచుకుంది. ఆఖరి రౌండ్లో ఆ జట్టు 3-1తో పోలెండ్‌పై విజయం సాధించింది. జార్జియా రజతం గెలుచుకుంది. ఓపెన్‌ విభాగంలో భారత్‌-2 మూడో స్థానంలో నిలిచింది. గుకేశ్‌, నిహాల్‌ సరీన్‌, ప్రజ్ఞానంద, రౌనక్‌ సధ్వానిలతో కూడి ఈ జట్టు ఆఖరి రౌండ్లో 3-1తో జర్మనీపై విజయం సాధించింది. లివ్యూ డైటర్‌పై రౌనక్‌, మతియాస్‌పై నిహాల్‌ నెగ్గగా.. విన్సెంట్తో గేమ్‌ను గుకేశ్‌, రాస్మస్‌తో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించారు.  అమెరికాతో తమ చివరి రౌండ్‌ గేమ్‌ను డ్రాగా ముగించిన భారత్‌-1 (హరికృష్ణ, విదిత్‌, అర్జున్‌ నారాయణన్‌).. నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌-3 జట్టు 31వ స్థానం సాధించింది. ఉజ్బెకిస్థాన్‌ స్వర్ణం ఎగరేసుకుపోయింది. బలమైన అర్మేనియా జట్టును రజతానికి పరిమితం చేసింది. చెస్‌ ఒలింయాడ్‌లో భారత్‌ 2014లో తొలిసారి పతకం (ఓపెన్‌లో కాంస్యం) గెలుచుకుంది. వ్యక్తిగత ప్రదర్శనలకుగాను గుకేశ్‌, సరీన్‌ స్వర్ణాలు.. అర్జున్‌ రజతం గెలుచుకున్నారు. ప్రజ్ఞానంద, వైశాలి, తానియా, దివ్య కాంస్యాలు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని