Charanjit singh : భారత హాకీ దిగ్గజం చరణ్‌జిత్‌ సింగ్‌ కన్నుమూత

 భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ చరణ్‌జిత్‌ సింగ్‌..

Published : 27 Jan 2022 16:54 IST

సంతాపం వెల్లడించిన హిమాచల్‌ సీఎం, హాకీ ఇండియా

ఇంటర్నెట్ డెస్క్‌: భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత చరణ్‌జిత్‌ సింగ్‌ (91) కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్యానికి తోడు గుండెపోటు రావడంతో హిమాచల్‌ప్రదేశ్‌ ఉనాలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. మిడ్‌ఫీల్డర్‌ అయిన చరణ్‌జిత్‌ 1964 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన టీమ్‌ఇండియా జట్టుకు సారథ్యం వహించాడు. చరణ్‌జిత్‌ భార్య పన్నెండేళ్ల కిందటే మృతి చెందగా.. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ‘‘ఐదేళ్ల కిందట గుండెపోటుకు గురై చికిత్సతో కోలుకున్నారు. అయితే అప్పటి నుంచి పక్షవాతంతో బాధపడుతున్నారు. అయితే గత మూడు నెలలుగా ఆరోగ్యం క్షీణించింది. ఇవాళ ఉదయం మనల్ని వదిలి వెళ్లిపోయారు’’ అని చరణ్‌జిత్ కుమారుడు వీపీ సింగ్ వెల్లడించారు. ఈ రోజు సాయంత్రమే అంత్యక్రియలను పూర్తి చేస్తామని వీపీ సింగ్‌ తెలిపారు. 

చరణ్‌జిత్‌ మృతికి హాకీ ఇండియా, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌ ట్విటర్‌ వేదికగా సంతాపం ప్రకటించారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో టీమ్‌ఇండియాకు సారథిగా బాధ్యతలు చేపట్టిన చరణ్‌జిత్ స్వర్ణపతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు 1960 ఒలింపిక్స్‌లోనూ సభ్యుడిగా ఆడాడు. అప్పుడు భారత్‌ ఫైనల్‌కు చేరినా ఓడిపోవడంతో రజత పతకంతో సరిపెట్టుకుంది. 1962 ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ గెలిచిన టీమ్‌కు చరణ్‌జిత్‌ ప్రాతినిధ్యం వహించాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని