IPL 2021 TITLE: నా అంచనా ప్రకారం ఆ జట్టుదే ఐపీఎల్‌ టైటిల్‌: మైఖేల్‌ వాన్‌

ఐపీఎల్‌ 2021 సీజన్‌ విజేత ఎవరో చెప్పిన మైకెల్‌ వాన్‌

Published : 15 Oct 2021 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) తుదిపోరు జరుగుతోంది. టాస్‌ నెగ్గిన కేకేఆర్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఆయా ఫ్రాంచైజీ అభిమానులు తమ జట్టే గెలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. క్రికెట్‌ వ్యాఖ్యాతలు, విశ్లేషకులు తమదైన అంచనాలతో ఏ జట్టు విజయం సాధిస్తుందో చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్ కూడా ఏ జట్టు ట్రోఫీని గెలుచుకోనుందో ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌లో విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నట్లు తెలిపాడు. కేకేఆర్‌పై సీఎస్‌కే గెలిచి నాలుగోసారి ఐపీఎల్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోనుందని వాన్ జోస్యం చెప్పాడు. అలానే సీఎస్‌కే ఆటగాడు, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికవుతాడని వెల్లడించాడు.

ఇదీ జట్లపరంగా బలాలు..

జట్లపరంగా సీఎస్‌కే, కేకేఆర్‌ సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లతోపాటు ఆల్‌రౌండర్లూ సమతూకంగా ఉన్నారు. సీఎస్‌కేలో ధోనీ అదనపు బలం కాగా.. డుప్లెసిస్‌, రుతురాజ్‌, అంబటి రాయుడు, ఉతప్ప వంటి టాప్‌ బ్యాటర్లు ఉన్నారు. మొయిన్‌ అలీ, జడేజా సూపర్‌ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. బౌలింగ్‌ దళం దీపక్‌ చాహర్, ఠాకూర్, బ్రావో, హేజిల్‌వుడ్‌ రాణిస్తున్నారు. చివరి బ్యాటర్‌ వరకు బ్యాటింగ్‌ చేయగలిగి ఉండటం చెన్నై సూపర్ కింగ్స్‌ బలంగా చెప్పుకోవచ్చు. మరోవైపు లీగ్‌ దశలో అద్భుతంగా పుంజుకుని వరుస విజయాలతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఫైనల్‌కు చేరుకుంది. బెంగళూరు, దిల్లీపై సూపర్‌ విజయాలను నమోదు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్, వెంకటేశ్‌ అయ్యర్ ఫామ్‌లో ఉన్నారు. మిడిలార్డర్‌లో నితీశ్‌ రానా, రాహుల్‌ త్రిపాఠి, దినేశ్‌ కార్తిక్‌, ఇయాన్‌ మోర్గాన్... ఆల్‌రౌండర్లు షకిబ్‌, సునీల్‌ నరైన్ ఎలానూ ఉన్నారు. వీరందరినీ అడ్డుకోవాలంటే చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లు కాస్త శ్రమించాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని