IPL 2021: ఆసీస్‌ ఆటగాళ్లు వచ్చేస్తున్నారు!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి! వేదికలు, తేదీలపై స్పష్టత వచ్చేసింది. టీ20 ప్రపంచకప్‌ను యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ, ఐసీసీ రెండురోజుల క్రితమే స్పష్టం చేశాయి. ...

Published : 01 Jul 2021 14:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి! వేదికలు, తేదీలపై స్పష్టత వచ్చేసింది. టీ20 ప్రపంచకప్‌ను యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ, ఐసీసీ రెండురోజుల క్రితమే స్పష్టం చేశాయి. దాంతో విదేశీ ఆటగాళ్లు రెండో దశ ఐపీఎల్‌ ఆడేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు దుబాయ్‌ వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.

ఐపీఎల్‌ రెండో దశ సమయంలో ఆస్ట్రేలియాకు ద్వైపాక్షిక సిరీసులు ఉన్నాయి. వ్యక్తిగత, ఇతర కారణాలతో వాటికి అందుబాటులో ఉండలేమని కొందరు ఆటగాళ్లు చెప్పేశారు. దాదాపు 20 మంది ఐపీఎల్‌ ఆటగాళ్లలో తొమ్మిది మంది మాత్రమే బంగ్లా, వెస్టిండీస్‌ పర్యటనకు వస్తామని చెప్పారట. దాంతో గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జే రిచర్డ్‌సన్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, మార్కస్‌ స్టొయినిస్‌, డేనియెల్‌ సామ్స్‌ తదితరులు ఐపీఎల్‌కు వస్తారని తెలిసింది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ యూఏఈలో జరుగుతుండటంతో ఆస్ట్రేలియా క్రికెట్‌ సంఘం సైతం ఆలోచనలో పడిందని సమాచారం. వారిని అడ్డుకోకుండా ఉండటమే మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడేందుకు వస్తామని గతంలోనే చెప్పారు. ఇందుకోసమే కరీబియన్‌ లీగ్‌ను సైతం ముందుకు జరిపారు. ఇప్పుడు ఆసీస్‌ క్రికెటర్లలో చాలామంది వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డును బీసీసీఐ ఒప్పించే పనిలో పడిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అన్నీ ,కుదిరితే ఆంగ్లేయులూ రావడంలో సందేహమేమీ లేదు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని