Bumrah-Harshal: డెత్‌ ఓవర్లలో బుమ్రా-హర్షల్‌ కలిస్తే.. బీభత్సమే సృష్టిస్తారు!

న్యూజిలాండ్‌పై రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ జట్టు తరఫున అరంగేట్రం చేసిన హర్షల్‌ పటేల్‌ ప్రదర్శనపై...

Published : 20 Nov 2021 15:52 IST

విశ్లేషించిన డానియల్‌ వెటోరి, రాబిన్ ఉతప్ప

ఇంటర్నెట్ డెస్క్‌: న్యూజిలాండ్‌పై రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ జట్టు తరఫున అరంగేట్రం చేసిన హర్షల్‌ పటేల్‌ ప్రదర్శనపై క్రికెటర్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. కివీస్‌ను కట్టడి చేయడంలో హర్షల్‌ (2/25) కీలక పాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. డెత్‌ ఓవర్లలో అత్యంత ప్రభావవంతంగా బౌలింగ్‌ చేశాడు. హర్షల్‌ బౌలింగ్‌ ప్రదర్శనపై ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో ఛానల్‌లో రాబిన్‌ ఉతప్ప విశ్లేషిస్తూ.. ‘‘జస్ప్రీత్ బుమ్రాతో కలిసి హర్షల్‌ డెత్‌ ఓవర్లలో (ఆఖరి ఐదు ఓవర్లు) ప్రమాదకరంగా మారతాడు. ఇది భారత టీ20 జట్టుకు ఎంతో బలం. ఒత్తిడి పరిస్థితుల్లోనూ బంతిని చక్కటి స్థానంలో సంధించే నైపుణ్యం హర్షల్ సొంతం. మరీ ముఖ్యంగా  చెప్పాలంటే కివీస్‌తో మ్యాచ్‌లో తన రెండో ఓవర్‌ తొలి బంతికే ఫిలిప్స్‌ భారీ సిక్సర్‌ కొట్టాడు. రెండో బంతికి నోబాల్‌గా వేశాడు. అయితే అక్కడే హర్షల్‌ నైపుణ్యం బయటపడింది. అద్భుతంగా పుంజుకుని ఫ్రీహిట్ బంతిని డాట్‌ చేయడం.. తర్వాతి బంతికే ఫిలిప్స్‌ను ఔట్‌ చేశాడు’’ అని వివరించాడు. 

రాబిన్‌ ఉతప్ప విశ్లేషణను కివీస్‌ మాజీ కెప్టెన్‌ డానియల్‌ వెటోరి సమర్థించాడు. ఆఖరి ఓవర్లలో బుమ్రా బౌలింగ్‌కు హర్షల్‌ పటేల్‌ జతకలిస్తే భారత టీ20 జట్టు భీకరంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ‘‘ఇప్పటికే డెత్‌ ఓవర్లలో బుమ్రా ప్రమాదకరమైన బౌలర్‌ అని తెలుసు. ఆఖరి ఓవర్లలో హర్షల్‌ పటేల్‌ కూడా బౌలింగ్‌ చేసే నైపుణ్యం పెంచుకుంటే మాత్రం పొట్టిఫార్మాట్‌లో టీమ్‌ఇండియా జట్టు బలోపేతమవుతుంది. మరో కొత్త బౌలర్‌ అవేశ్ ఖాన్‌ పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్‌ చేయగలడు. ఎందుకంటే అతడు స్పెషలిస్ట్‌ బౌలర్‌గా టాప్‌ స్థానంలో ఉన్నాడు’ అని వెటోరీ విశ్లేషించాడు. ఇతర జట్లలోనూ డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేసేందుకు ఎక్కువ మంది బౌలర్లు లేరని, అయితే భారత్‌కు కనీసం ఇద్దరు ఉండటం వల్ల టీ20ల్లో టీమ్‌ఇండియా భీకరమైన జట్టుగా మారుతుందని వెటోరి అంచనా వేశాడు. 

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని