చాహల్‌ ఫోన్‌ చేసి చెబితే జోక్‌ అనుకున్నా

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యానని యుజువేంద్ర చాహల్‌ ఫోన్‌ చేసి చెబితే జోక్‌ చేస్తున్నాడని అనుకున్నానని రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ తెవాతియా అన్నాడు...

Updated : 20 Sep 2022 15:55 IST

రాజస్థాన్‌ ఆటగాడు రాహుల్‌ తెవాతియా

(Pic:Rahul Tewatia twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యానని యుజువేంద్ర చాహల్‌ ఫోన్‌ చేసి చెబితే జోక్‌ చేస్తున్నాడని అనుకున్నానని రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ తెవాతియా అన్నాడు. ఇంగ్లీష్‌ జట్టుతో టెస్టు సిరీస్‌ తర్వాత మొతేరాలో జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌కు శనివారం రాత్రి బీసీసీఐ 19 మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసిన ముంబయి ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌తో పాటు రాజస్థాన్‌ ఆల్‌రౌండర్‌ తెవాతియా తొలిసారి టీమ్ఇండియాకు ఎంపికయ్యారు. కాగా, రాహుల్‌ ప్రస్తుతం విజయ్‌ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు.

‘నేను టీమ్‌ఇండియాకు ఎంపికయ్యానని చాహల్‌ భాయ్‌ ఫోన్‌చేసి చెబితే జోక్‌ చేస్తున్నాడేమో అనుకున్నా. తర్వాత మోహిత్‌ శర్మ కూడా నా వద్దకొచ్చి అదే విషయం చెప్పాడు. చాలా సంతోషమేసింది. అయితే, ఇంత త్వరగా భారత్‌ జట్టుకు ఎంపికౌతానని అస్సలు ఊహించలేదు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా. హరియాణా నుంచి ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు చాహల్‌, అమిత్‌ మిశ్రా, జయంత్‌ యాదవ్‌ టీమ్‌ఇండియాకు ఆడారు. నాకు అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఐపీఎల్‌ ద్వారా ప్రజలు నన్ను గుర్తుపడుతున్నారు. ఇలాగే మంచి ప్రదర్శన చేస్తే టీమ్‌ఇండియాకు ఎంపికౌతానని అనుకున్నా. కానీ, ఇంత త్వరగా అని మాత్రం అనుకోలేదు’ అని రాహుల్‌ మీడియాతో చెప్పాడు.

కాగా, గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ మెగా ఈవెంట్‌లో పంజాబ్‌తో తలపడిన ఓ లీగ్‌ మ్యాచ్‌లో రాహుల్‌ (53; 31 బంతుల్లో 7x6) చెలరేగిపోయాడు. ఓటమివైపు వెళుతున్న రాజస్థాన్‌ను తన సిక్సుల వర్షంతో గెలిపించాడు. కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్‌లో ఐదు సిక్సులు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో తన పేరు మొత్తం సామాజిక మాధ్యమాల్లో మార్మోగిపోయేలా చేసుకున్నాడు. తర్వాత పలు మ్యాచ్‌ల్లోనూ మంచి బ్యాటింగ్‌ ప్రదర్శన చేయడంతో ఇప్పుడు ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. కాగా, రాహుల్‌ ప్రస్తుతం విజయ్‌ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని