IPL 2021: చెన్నైపై రాజస్థాన్‌ ఘన విజయం

చెన్నై సూపర్‌ కింగ్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated : 02 Oct 2021 23:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ అదరగొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై జట్టు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్‌ జట్టు 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. 3 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ (50: 21 బంతుల్లో 4X6, 3X6), శివమ్‌ దూబె (64: 42 బంతుల్లో 4X6, 4X6 ) ధాటికి భారీ లక్ష్యం కరిగిపోయింది. ఎవిన్ లూయిస్‌ (27), సంజూ శాంసన్ (28), ఫిలిప్స్ (14) పరుగులతో తమ వంతు సాయం అందించారు. చెన్నై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 2, కేఎమ్ ఆసిఫ్‌ ఒక వికెట్ తీశారు. రాజస్థాన్ ఘన విజయం సాధించడంతో.. చెన్నై ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (101) అద్భుత శతకం వృథా అయింది.  

అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆ జట్టు ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (101: 60 బంతుల్లో 9x4, 5x6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖర్లో వచ్చిన రవీంద్ర జడేజా (32: 15 బంతుల్లో 4x4, 1x6) దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ కలిసి చివరి ఓవర్లలో రెండు ఫోర్లు, రెండు సిక్సులు సహా 22 పరుగులు రాబట్టారు. డు ప్లెసిస్‌ (25), మొయిన్ అలీ (21) ఫర్వాలేదనిపించారు. సురేశ్ రైనా (3), అంబటి రాయుడు (2) నిరాశ పరిచారు. రాజస్థాన్‌ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు, చేతన్‌ సకారియా ఒక వికెట్ తీశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని