WTC Finals:  అదే కివీస్‌కు ప్లస్‌.. టీమిండియాకు మైనస్‌!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ కచ్చితమైన ప్రణాళికతో పాటు కలిసికట్టుగా బరిలోకి దిగుతుందని, దానికంటే ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడటం కూడా ఆ జట్టుకు కలిసివస్తుందని టీమ్‌ఇండియా...

Published : 12 Jun 2021 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ కచ్చితమైన ప్రణాళికతో పాటు కలిసికట్టుగా బరిలోకి దిగుతుందని, దానికంటే ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడటం కూడా ఆ జట్టుకు కలిసివస్తుందని టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పేర్కొన్నాడు. ఈ విషయంలో అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా భారత్‌ జట్టు మారి అలవాటు పడాలని, అదే మనకు కీలకమని చెప్పాడు. తాజాగా బీసీసీఐ టీవీతో మాట్లాడిన సందర్భంగా  ఛాంపియన్‌షిప్‌పై అతడు ఈ అభిప్రాయాల్ని వ్యక్తంచేశాడు.

అనంతరం ఇషాంత్‌ శర్మ మాట్లాడుతూ.. ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కష్టతరమైన ప్రయాణమని, అలాగే భావోద్వేగమైంది కూడా అని చెప్పుకొచ్చాడు. ఇది ఐసీసీ టోర్నమెంట్‌ అయినందున 50 ఓవర్ల ప్రపంచకప్‌ ఫైనల్‌తో సమానమన్నాడు. ఇక 2019లో వెస్టిండీస్‌తో ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభమైనప్పుడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ.. ఇది కేవలం నెల రోజుల కష్టం కాదని, రెండేళ్లు సాగే సుదీర్ఘ ప్రయాణమని పేర్కొన్నట్లు గుర్తుచేశాడు. అలాగే కొవిడ్‌-19తో ఈ టోర్నీలో నియమాలు మారినప్పుడు భారత్‌ కష్టపడాల్సి వచ్చిందని తెలిపాడు. క్లిష్టపరిస్థితుల్లోనే ఆస్ట్రేలియాపై విజయం సాధించామని, ఆపై ఇంగ్లాండ్‌తోనూ గెలుపొందామని ఇషాంత్‌ వివరించాడు.

ఇక ఆస్ట్రేలియా పర్యటనపై స్పందించిన షమి.. తమ రెండేళ్ల కష్టానికి అదే అసలైన పరీక్ష అని, అక్కడ విజయం సాధించడం కీలకమని పేర్కొన్నాడు. అందుకోసం తాము 110 శాతం కష్టపడాల్సి వచ్చిందన్నాడు. సీనియర్లు లేకున్నా యువ ఆటగాళ్లు కంగారూలపై సిరీస్‌ గెలవడం తనకు అమితానందం కలిగించిందని చెప్పాడు. ఆటగాళ్లు నేర్చుకునేందుకు ఆ టోర్నీ ఒక ఉదాహరణ అని, ఆ గెలుపుతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని షమి అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని