T20 World  Cup: దంచికొట్టిన రోహిత్‌, రాహుల్‌.. అఫ్గాన్‌ ముందు భారీ లక్ష్యం

టీ20 ప్రపంచ కప్‌లో అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్‌ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించగా..

Updated : 03 Nov 2021 21:34 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్‌ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు. రిషభ్ పంత్‌ (27; 13 బంతుల్లో 1 ఫోర్‌, మూడు సిక్స్‌లు), హార్దిక్ పాండ్య ( 35; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం చివర్లో దూకుడుగా ఆడారు. దీంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్‌ బౌలర్లలో గుల్బాదీన్‌, కరీం జనత్ తలో వికెట్ పడగొట్టారు.

ఇద్దరూ పోటాపోటీ..

ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే పోటాపోటీగా బౌండరీలు బాదారు. షరాఫుద్దీన్‌ వేసిన రెండో ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ ఫోర్‌, సిక్స్ బాదగా.. నవీన్‌ ఉల్ హక్‌ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. తర్వాతి మూడు ఓవర్లో స్కోరు కాస్త నెమ్మదించింది. తర్వాత వీరిద్దరూ మళ్లీ ధాటిగా ఆడారు. దీంతో 10 ఓవర్లకు భారత్‌ స్కోరు 85/0 వద్ద నిలిచింది. రషీద్‌ఖాన్‌ వేసిన 14వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన రోహిత్ శర్మ తర్వాతి ఓవర్‌లోనే నబీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కొద్దిసేపటికే కేఎల్ రాహుల్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య దూకుడుగా ఆడారు. గుల్బాదీన్‌ వేసిన 17వ ఓవర్‌లో పంత్‌ రెండు సిక్సర్లు కొట్టాడు. 18వ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన హార్ది్క్‌.. 19వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదాడు. 20వ ఓవర్‌లో పంత్‌ రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 20 పరుగులు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని