IND vs PAK: ప్రపంచ క్రికెట్‌లో దాయాది దేశాల పోరు కంటే ఏదీ ఎక్కువ కాదు: మాజీలు

ప్రపంచ క్రికెట్‌లో అతిపెద్ద పోరు యాషెస్‌ సిరీస్ కాదని...

Published : 22 Jan 2022 01:36 IST

ఈసారి టీమ్‌ఇండియా చెలరేగుతుందన్న మైకెల్ వాన్, గిల్‌క్రిస్ట్‌, స్టెయిన్

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ క్రికెట్‌లో అతిపెద్ద పోరు యాషెస్‌ సిరీస్ కాదని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకెల్‌ వాన్‌ పేర్కొన్నాడు. భారత్, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను అధికమంది చూస్తారని, ఇదే అసలైన సమరమని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ - 2022 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసేసింది. మరోసారి దాయాది జట్లు ఒకే గ్రూప్‌లో తలపడనున్నాయి. అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానుల్లో ఉత్సుకత రేగింది. ఈ క్రమంలో దాయాది దేశాల పోరుపై మైకెల్‌ వాన్, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, డేల్‌ స్టెయిన్‌ స్పందించారు. 

ఓ క్రీడా ఛానెల్‌ చర్చా కార్యక్రమంలో మైకెల్‌ వాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లాండ్‌, ఆసీస్ మాజీ ఆటగాళ్లుగా యాషెస్‌ సిరీస్‌నే బిగ్గెస్ట్‌ గేమ్‌గా భావిస్తాం. అయితే అది తప్పు. భారత్ ‌x పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే మ్యాచే అతిపెద్ద పోరు. రోహిత్ శర్మ సారథిగా అసలైన సవాల్‌ను ఎదుర్కోనున్నాడు. రాబోయే వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రత్యేకంగా నిలవనుంది’’ అని తెలిపాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్‌ చెలరేగుతుందని ఆసీస్‌ మాజీ ఆటగాడు గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. ‘‘దాయాదుల మధ్య భారీ పోటీ ఉండటం ఖాయం. గత ప్రపంచకప్‌లో పది వికెట్ల తేడాతో భారత్‌పై పాక్‌ విజయం సాధించింది. కాబట్టే ఈసారి టీమ్‌ఇండియా చెలరేగుతుందని భావిస్తున్నా’’ అని గిల్‌క్రిస్ట్‌ పేర్కొన్నాడు. భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు దక్షిణాఫ్రికా మాజీ పేస్ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ పేర్కొన్నాడు. ‘‘దాయాది దేశాల మధ్య మ్యాచ్‌ అంటేనే క్రేజీగా ఉంటుంది. అందుకు మెల్‌బోర్న్ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదిక కావడం విశేషం. ఎంసీజీ అంటే నాకెంతో ఇష్టం. 2015 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాతో ఇక్కడే తలపడ్డాం’’ అని గుర్తు చేసుకున్నాడు.

గత పొట్టి ప్రపంచకప్‌లోనూ (2021) మొదటి మ్యాచ్‌లో పాక్‌తోనే టీమ్‌ఇండియా తలపడిన విషయం తెలిసిందే. కోహ్లీ నాయకత్వంలోని భారత్‌ వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడి సెమీస్‌ అవకాశాలను చేజార్చుకుంది. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో ఇప్పటి వరకు ఆరు సార్లు తలపడగా.. భారత్‌ ఐదు సార్లు విజయం సాధించింది. అయితే ఈసారి రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత్‌ జట్టు ప్రపంచకప్‌ బరిలోకి దిగనుంది. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచకప్‌ పోటీలు జరుగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని