
Yuvraj Singh: 30 ఏళ్లకే విరాట్..!
దిగ్గజమైపోయాడన్న యువరాజ్ సింగ్
ముంబయి: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీపై యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. 30 ఏళ్ల వయసులోనే అతడు దిగ్గజంగా మారిపోయాడని కొనియాడాడు. అరంగేట్రం చేసినప్పటి నుంచే అతడు ఎక్కువగా శ్రమించేవాడని పేర్కొన్నాడు. నాయకుడు అయ్యాక మరింత నిలకడగా ఆడటం మొదలు పెట్టాడని వెల్లడించాడు.
‘వేల పరుగులు చేసి విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. కొన్నిసార్లు ఆటగాళ్లు ఫామ్ కోల్పోతారు. అతడు మాత్రం నాయకుడు అయ్యాక మరింత నిలకడగా ఆడుతున్నాడు. 30 ఏళ్లకే ఎంతో సాధించాడు. సాధారణంగా వీడ్కోలు పలికినప్పుడు ఆటగాళ్లు దిగ్గజాలుగా మారతారు. కానీ విరాట్ ఇప్పటికే దిగ్గజంగా అవతరించాడు’ అని యువీ అన్నాడు.
‘క్రికెటర్గా కోహ్లీ ఎదుగుదల గొప్పగా ఉంది. ఎవరూ చేరుకోలేని శిఖరాలను అతడు అధిరోహిస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే అతడికి ఇంకెంతో సమయం ఉంది. అతడు కఠోరంగా శ్రమించడం, సాధన చేయడం నా కళ్లతో చూశా. తన ఆహారపుటలవాట్ల పట్ల కఠినంగా ఉంటాడు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్ అన్న వైఖరితో ఆడతాడు’ అని యువీ తెలిపాడు.