Paralympics‌: టేబుల్ టెన్నిస్‌లో భవీనాకు రజతం

పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చింది. టేబుల్‌ టెన్నిస్‌లో భవీనాబెన్‌ పటేల్‌ రజతం సాధించింది.

Updated : 29 Aug 2021 12:08 IST

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చింది. టేబుల్‌ టెన్నిస్‌లో భవీనాబెన్‌ పటేల్‌ రజతం సాధించింది. స్వర్ణ పతక పోరులో ప్రపంచ నంబర్‌ వన్‌, చైనా క్రీడాకారిణి యింగ్‌ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలైంది. దీంతో ఆమె రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం.  

ఇదీ భవీనా నేపథ్యం..

భవీనా బెన్‌ పటేల్‌ది గుజరాత్‌లోని మెహసానా. అయిదేళ్ల కిందటే 2016 రియో పారాలింపిక్స్‌కు ఆమె ఎంపికైంది. కానీ సాంకేతిక కారణాల వల్ల పోటీల్లో పాల్గొనలేకపోయింది. అయినా భవీనా పట్టుదల వీడలేదు. టోక్యోలో అడుగుపెట్టింది. ఇక్కడ తొలి మ్యాచ్‌లోనే ఓడినా ఆమె ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. ఎందుకంటే ఇలాంటి అడ్డంకులు.. ఒడుదొడుకులు.. ప్రతికూల  పరిస్థితులు.. ఆమెకు చిన్నప్పటి నుంచే అలవాటు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన భవీనా పోలియో కారణంగా బాల్యంలోనే చక్రాల కుర్చీకి పరిమితమైంది. తన స్నేహితులందరూ గెంతులేస్తూ ఆడుతుంటే తాను మాత్రం నడవలేకపోతున్నానని బాధ పడేది. ఆ సమయంలో కుటుంబం తనకు అండగా నిలిచింది. భవీనా తండ్రి 2004లో ఆమెను అహ్మదాబాద్‌లోని బ్లైండ్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌లో చేర్పించాడు. అక్కడే ఆమె టీటీ కెరీర్‌కు అంకురార్పణ జరిగింది. ఫిట్‌నెస్‌ కోసం సరదాగా టీటీ ఆడడం మొదలెట్టి ఆటపై ప్రేమ పెంచుకుంది. మూడేళ్ల పాటు తీవ్రంగా కష్టపడి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. మొత్తం మీద పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన రెండో భారత మహిళా   అథ్లెట్‌గా రికార్డు నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఓడినా ర్యాంకింగ్స్‌లో తనకంటే మెరుగైన  ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని