INDvsENG: ఇంగ్లాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ.. మూడో టెస్టుకు కీలక పేసర్‌ ఔట్

టీమ్‌ఇండియాతో టెస్టు సిరీస్‌ ఆడుతున్న ఇంగ్లాండ్‌ జట్టుకు తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని కీలక పేసర్‌ మార్క్‌వుడ్‌ మూడో టెస్టుకు దూరమయ్యాడు...

Published : 23 Aug 2021 18:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో టెస్టు సిరీస్‌ ఆడుతున్న ఇంగ్లాండ్‌ జట్టుకు తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని కీలక పేసర్‌ మార్క్‌వుడ్‌ మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతడి కుడి భుజానికి గాయమవడంతో తర్వాతి మ్యాచ్‌లో ఆడటంలేదని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతవారం లార్డ్స్‌ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టులో మార్క్‌వుడ్‌ నాలుగో రోజు ఫీల్డింగ్‌ చేస్తూ కిందపడ్డాడు. దాంతో అతడి కుడి భుజానికి గాయమైందని ఆ జట్టు పేర్కొంది.

కాగా, ఇంతకుముందే ఇంగ్లాండ్‌ జట్టులో ప్రధాన పేసర్లు.. స్టువర్ట్‌ బ్రాడ్‌, జోఫ్రా ఆర్చర్‌ గాయాల నుంచి వైదొలిగారు. అలాగే స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ సైతం మానసిక ఆరోగ్య సమస్యల పేరుతో కొద్ది కాలం ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టులో ఆడిన ఇంగ్లాండ్‌ ఐదో రోజు ఉదయం సెషన్‌ వరకూ భారత్‌పై ఆధిపత్యం చెలాయించింది. కానీ, అనూహ్యంగా బుమ్రా, షమి తమ బ్యాటింగ్‌తో చెలరేగి ఇంగ్లాండ్‌ జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. అనంతరం తమ బౌలింగ్‌ నైపుణ్యంతోనూ మెరవడంతో ఇంగ్లాండ్‌ ఆ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దాంతో ఈ సిరీస్‌లో 0-1తో వెనుకపడింది. ఈ నేపథ్యంలో మార్క్‌వుడ్‌ కూడా దూరమవ్వడం ఆ జట్టు కష్టాలను రెట్టింపు చేసింది. అతడు ఆ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి ఆకట్టుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని