Virat Kohli: కోహ్లీ దూకుడు ఇష్టమే..కానీ: ఫరూక్

క్రికెట్‌ మైదానంలో ప్రత్యర్థులతో వాగ్వాదానికి దిగినప్పుడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దూకుడు ఇష్టమే అయినా అతడు అదుపులో ఉండాలని మాజీ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ అన్నాడు...

Published : 22 Aug 2021 17:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ మైదానంలో ప్రత్యర్థులతో వాగ్వాదానికి దిగినప్పుడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దూకుడు ఇష్టమే అయినా అతడు అదుపులో ఉండాలని మాజీ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ సూచించాడు. అనవసర విషయాలకు వెళ్లి పరిస్థితులు చేయిదాటిపోయేలా చేసుకోవద్దన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య భీకర పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు తమ నోటికి పనిచెప్పారు. దాంతో కెప్టెన్‌ విరాట్‌ సైతం అంతే దీటుగా వారికి జవాబిచ్చాడు. ఈ విషయంపైనే ఫరూక్‌ ఇంజినీర్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘ప్రత్యర్థులతో దూకుడుగా ఉండే విషయంలో నేను కోహ్లీని ఎంతో ఇష్టపడతాను. అతడో స్ఫూర్తిదాయక సారథి. ఎల్లప్పుడూ మైదానంలో చురుగ్గా ఉంటాడు. ఎవరైనా అలాగే ఉండాలి. అయితే, అది పరిమితులకు మించి ఉండకూడదు. లేకపోతే అంపైర్లు లేదా మ్యాచ్‌ రిఫరీలు కలుగజేసుకుంటే వివాదం పెద్దది అవుతుంది. అలాగే విరాట్‌ కొన్నిసార్లు తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కానీ, నాకు అతడి తీరు ఎంతో ముచ్చటేస్తుంది. అతడో మేటి సారథి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అతడు’ అంటూ ఫరూక్‌ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు కవ్వింపులకు దిగారని, దాంతో భారత బ్యాట్స్‌మెన్‌ను మానసికంగా దెబ్బతీయాలని చూశారని మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు. బుమ్రా, షమి అద్భుతంగా ఆడి దీటుగా జవాబిచ్చారన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని