IND vs ENG: ఐదో టెస్టు నుంచి భారత్‌ తప్పుకోవడానికి అదే కారణం: నాసర్ హుస్సేన్‌

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు నుంచి టీమ్‌ఇండియా తప్పుకోడానికి తీరిక లేని షెడ్యూల్‌ కారణమని, అందులోనూ ఐపీఎల్‌లాంటి మెగా ఈవెంట్‌ ముందుండటం మరో కారణమని ఆ జట్టు మాజీ సారథి నాసర్‌ హుసేన్‌ అభిప్రాయపడ్డాడు...

Updated : 12 Sep 2021 11:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు నుంచి టీమ్‌ఇండియా తప్పుకోవడానికి తీరిక లేని షెడ్యూలే కారణమని.. అందులోనూ ఐపీఎల్‌లాంటి మెగా ఈవెంట్‌ ముందుండటం మరో కారణమని ఆ జట్టు మాజీ సారథి నాసర్‌ హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌ఇండియా బృందంలో కరోనా వైరస్‌ సోకిన వెంటనే కొంతమంది ఐపీఎల్‌ గురించి ఆలోచించారన్నాడు. దురదృష్టం కొద్దీ క్రికెట్‌లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నాడు.

‘ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకొని టీమ్‌ఇండియా ఇంతకుముందే ఐదో టెస్టును ముందుగా నిర్వహించడానికి ప్రయత్నాలు చేసింది. ఐపీఎల్ లీగ్‌ భారత ఆటగాళ్లకు ముఖ్యం.. అందులో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి’ అని నాసర్‌ పేర్కొన్నాడు. ఏ జట్టు అయినా ఇలా మ్యాచ్‌ ఆడకుండా తప్పుకొంటే ఎవరూ ఏమీ చేయలేరన్నాడు. ప్రస్తుతం దీన్ని రీషెడ్యూల్‌ చేసే పరిస్థితులు లేనందున భవిష్యత్‌లో ఎప్పుడైనా సర్దుబాటు చేయడమే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. ఇందులో టీమ్‌ఇండియా ఆటగాళ్లని తప్పుపట్టడం సరికాదని, గత డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లూ వెనకడుగు వేశారని గుర్తుచేశాడు. అప్పుడు కొంతమంది ఆటగాళ్లు బిగ్‌బాష్‌ లీగ్‌కు వెళ్లాలని చూశారని, మరికొందరు తమ ఇళ్లకు వెళ్లాలనుకున్నారని మాజీ సారథి వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని