IND vs NZ: చివర్లో ఆకట్టుకున్న అశ్విన్‌.. టీమ్‌ఇండియా 345 ఆలౌట్‌

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 345 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (105; 171 బంతుల్లో 13x4, 2x6) శతకంతో కదంతొక్కాడు...

Updated : 29 Nov 2022 12:31 IST

శతకంతో కదంతొక్కిన శ్రేయస్‌ అయ్యర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 345 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (105; 171 బంతుల్లో 13x4, 2x6) శతకంతో కదంతొక్కాడు. రవీంద్ర జడేజా (50; 112 బంతుల్లో 6x4) తొలిరోజు స్కోర్‌ వద్దే ఔటయ్యాడు. ఇక టెయిలెండర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ (38; 56 బంతుల్లో 5x4) కీలక పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌సౌథీ 5/69, కైల్‌ జేమీసన్‌ 3/91, అజాజ్‌ పటేల్‌ 2/90 ప్రదర్శన చేశారు.

భారత్‌ ఓవర్‌నైట్‌ స్కోర్‌ 258/4తో శుక్రవారం రెండో రోజు ఆట ప్రారంభించగా మరో 87 పరుగులు సాధించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకున్న సౌథీ ఈ ఉదయం మరో నాలుగు వికెట్లు సాధించాడు. ఆదిలోనే జడ్డూను బౌల్డ్‌ చేసిన అతడు తర్వాత వృద్ధిమాన్‌ సాహా (1), అక్షర్‌ పటేల్‌(3)ను కూడా పెవిలియన్‌ పంపాడు. వీరిద్దరూ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు. ఈ క్రమంలోనే జేమీసన్‌ వేసిన 92వ ఓవర్‌లో శ్రేయస్‌ తొలి బంతికి రెండు పరుగులు సాధించి టెస్టుల్లో తొలి శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక భోజన విరామానికి ముందు అశ్విన్‌ కాస్త బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ 339/8తో తొలి సెషన్‌ను ముగించింది. భోజన విరామం అనంతరం అజాజ్‌ పటేల్‌ అశ్విన్‌, ఇషాంత్‌(0)ను ఔట్‌ చేయడంతో భారత ఇన్నింగ్స్‌కు 345 పరుగుల వద్ద తెరపడింది. ఉమేశ్‌ (10; 34 బంతుల్లో 1x6) నాటౌట్‌గా నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని