IPL 2021: తొలుత ఆందోళన చెందాం.. ఈ ఓటమి నిరాశ కలిగించింది

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో షార్జా పిచ్‌పై తేమ ప్రభావం ఉంటుందేమోనని ఆందోళన చెందామని చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ అన్నాడు...

Updated : 27 Feb 2024 15:05 IST

ధోనీ-కోహ్లీ ఏమన్నారంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నై దూసుకుపోతోంది. శుక్రవారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్‌ అనంతరం స్పందించిన కెప్టెన్‌ ధోనీ.. షార్జా పిచ్‌పై తేమ ప్రభావం ఉంటుందేమోనని ఆందోళన చెందామని అన్నాడు. ‘బెంగళూరు శుభారంభం చేసింది. అయితే, తొమ్మిదో ఓవర్‌ తర్వాత పిచ్‌ కాస్త నెమ్మదించింది. పడిక్కల్‌ ఆడేటప్పుడు జడేజా స్పెల్‌ కీలకమైంది. మరో ఎండ్‌ నుంచి మొయిన్‌ అలీని బౌలింగ్‌ చేయాలని ముందే చెప్పా. కానీ డ్రింక్స్‌ సమయంలో బ్రావోని దింపాలని ప్రణాళిక మార్చుకున్న. అలాంటి పిచ్‌పై బ్రావో వరుసగా నాలుగు ఓవర్లు వేస్తే బాగుంటుందని అనిపించింది’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.

మరోవైపు తమ బౌలర్లు పరిస్థితులను అర్థం చేసుకున్నారని, వాళ్ల బాధ్యతలేంటో తెలుసుకున్నారని ధోనీ చెప్పాడు. అలాగే యూఏఈలోని పిచ్‌లు ప్రత్యేకంగా ఉన్నాయని, అందులోనూ షార్జా పిచ్‌ మరీ నెమ్మదిగా ఉందన్నాడు. దీంతో తమ బ్యాటింగ్‌ లైనప్‌లో కుడి-ఎడమ కాంబినేషన్‌ బాగుంటుందని అనిపించినట్లు చెన్నై సారథి చెప్పాడు. తమ జట్టులో చాలా మంది లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నారని, ఈ క్రమంలోనే రైనా, రాయుడులను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కిందకు పంపామన్నాడు. చివరగా బ్రావో బౌలింగ్‌పై స్పందించిన మహీ.. అతడు స్లో బౌలర్‌ అని.. ఒక్క ఓవర్‌లో ఆరు వైవిధ్యమైన బంతులు వేయాలని చెప్పానన్నాడు.

నిరాశకు గురిచేసింది: కోహ్లీ

అనంతరం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ ఈ ఓటమి తనని మరింత నిరాశకు గురిచేసిందని తెలిపాడు. ఈ పిచ్‌ అనుహ్యంగా నెమ్మదించిందని, దీంతో మరో 15-20 పరుగులు రాబట్టలేకపోయమన్నాడు. తాము 175 పరుగులు చేసుంటే గెలిచే అవకాశం ఉండేదన్నాడు. మరోవైపు బంతితో ప్రభావం చూపలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. తాము బ్యాటింగ్‌ చేసేటప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఖర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిందన్నాడు. చివర్లో స్లో బంతులు, యార్కర్లు వేసి తమని కట్టడి చేశారని పేర్కొన్నాడు. తాము మళ్లీ విజయాల బాట పట్టాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ ఓటమి చాలా నిరాశకు గురిచేసిందని, కీలక సమయాల్లో తమ ఆటగాళ్లు మరింత పట్టుదలగా ఆడాలని సూచించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని