IPL 2021: మోర్గాన్‌ కన్నా ధోనీనే బాగా ఆడుతున్నాడు‌: గంభీర్

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి. అందరి కన్నా ముందు ధోనీసేన ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకోగా ఆఖరి నిమిషంలో మోర్గాన్‌ టీమ్‌ నాలుగో స్థానంతో పోటీలోకి వచ్చింది...

Published : 15 Oct 2021 16:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి. అందరి కన్నా ముందు ధోనీసేన ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకోగా ఆఖరి నిమిషంలో మోర్గాన్‌ టీమ్‌ నాలుగో స్థానంతో పోటీలోకి వచ్చింది. ఇక్కడ ఆ జట్టు బెంగళూరు, దిల్లీ జట్లను ఓడించి తుదిపోరులో చెన్నైని ఢీకొట్టేందుకు సిద్ధమైంది. అయితే, కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ కన్నా చెన్నై సారథి మహేంద్రసింగ్‌ ధోనీనే ఇప్పుడు బాగా ఆడుతున్నాడని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ అతడీ వ్యాఖ్యలు చేశాడు.

రెండు జట్ల సారథులను పోల్చి చూడటం సరికాదని, ఎందుకంటే ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడని గంభీర్‌ గుర్తుచేశాడు. మరోవైపు మోర్గాన్‌ ఇంగ్లాండ్‌ జట్టుకు ఇంకా నాయకత్వం వహిస్తున్నాడని చెప్పాడు. దీంతో ఇద్దరినీ పోల్చి చూడటమంటే యాపిల్‌తో ఆరెంజ్‌ను పోల్చడమేనని అభిప్రాయపడ్డాడు. ధోనీ చాలా రోజులుగా సరైన క్రికెట్‌ ఆడటంలేని కారణంగా ఇప్పుడు పరుగులు చేయకపోయినా అర్థం చేసుకోవచ్చని చెప్పాడు. అలాగే మోర్గాన్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. అయినా, ఈ సీజన్‌లో ధోనీనే బాగా ఆడుతున్నాడని కోల్‌కతా మాజీ సారథి చెప్పుకొచ్చాడు. మరోవైపు చెన్నై సారథి బ్యాటింగ్‌, కెప్టెన్సీతో పాటు కీపింగ్‌ కూడా అదనంగా చేస్తున్నాడని గంభీర్‌ వివరించాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరినీ పోల్చిచూడటం సరికాదని వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని