Sanjay bangar: బుమ్రా అలా చేయడు.. జిమ్మీని రెచ్చగొట్టాలన్నది కోహ్లీ ప్రణాళికే అనుకుంటా!

టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఎవరినీ కవ్వించడని మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అంటున్నాడు.....

Published : 22 Aug 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఎవరినీ కవ్వించడని మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అంటున్నాడు. నిజానికి అండర్సన్‌ను రెచ్చగొట్టాలన్నది కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రణాళిక కావొచ్చని అంచనా వేశాడు. ప్రత్యర్థి జట్టులో ప్రధాన ఆటగాడిని కవ్వించాలన్నది అతడి ఉద్దేశం కావొచ్చని పేర్కొన్నాడు.

లార్డ్స్‌ టెస్టులో రెండు జట్ల ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్న సంగతి తెలిసిందే. మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన అండర్సన్‌కు బుమ్రా షార్ట్‌పిచ్‌ బంతులు వేయడంతో ఇది మొదలైంది. కొన్ని బంతులు దేహానికి తగలడంతో జిమ్మీ ఆవేశపడ్డాడు. అతడికి సారీ చెబుదామని వెళ్లిన బుమ్రాను తోసేని బూతులు తిట్టాడు. తర్వాతి రోజు బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రాకు ఆంగ్లేయులు షార్ట్‌పిచ్‌ల బంతులు విసిరి గాయపర్చాలని భావించారు. కానీ అది బెడిసికొట్టింది.

‘పదకొండో బ్యాటరైన అండర్సన్‌కు బుమ్రా 150 మైళ్ల వేగంతో బంతులు వేశాడు. పుల్‌ లెంగ్త్‌, షార్ట్‌పిచ్‌ బంతులతో దేహానికి గురిపెట్టాడు. సాధారణంగా ఇది బుమ్రా స్వభావం కాదు. అతడు వేగంగా బంతులేస్తూ వికెట్లకు గురిపెడతాడు. అలా చేసుంటే ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ఇంకా త్వరగానే ముగిసేది. షార్ట్‌పిచ్‌ బంతులు వేయాలన్నది బహుశా విరాట్‌ కోహ్లీ ప్రణాళిక అయ్యుంటుంది. దానిని బుమ్రా అమలు చేశాడు. బహుశా ఇంగ్లాండ్‌ ప్రధాన ఆటగాడైన అండర్సన్‌ను రెచ్చగొట్టాలనో లేదా రెచ్చగొట్టి శాంతింపజేయాలనో లేదా అతడిని గాయపర్చాలనో ఇలా చేసుండొచ్చు. దాంతో ఆంగ్లేయులు డీలా పడతారని అనుకోవచ్చు’ అని బంగర్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని