
ద్రవిడ్ ఆందోళన.. రాహుల్తో దీపక్కు సందేశం!
ఇంటర్నెట్ డెస్క్: రాహుల్ ద్రవిడ్ అంటేనే మిస్టర్ కూల్! మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా సాగుతున్నా అతడు మాత్రం ప్రశాంతంగానే ఉంటాడు. శ్రీలంకతో రెండో వన్డేలో మాత్రం అతడు కాస్త ఆందోళన చెందినట్టు కనిపించింది. వెంటనే డ్రస్సింగ్ రూమ్ నుంచి డగౌట్కు చేరుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న దీపక్ చాహర్కు తమ్ముడు రాహుల్ చాహర్తో ఏదో సందేశం పంపించాడు. ఆ సంగతి పక్కనపెడితే అతడు డగౌట్లో కనిపించడం మాత్రం వైరల్గా మారింది.
లంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 160కే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన దీపక్ చాహర్ (69*; 82 బంతుల్లో 7×4, 1×6), భువనేశ్వర్తో కలిసి జట్టుకు విజయం అందించాడు. అయితే, రజిత వేసిన 44వ ఓవర్లో దీపక్ రిస్కీ షాట్లు ఆడాడు. ఓవర్లు దగ్గర పడుతుండటం, ఉత్కంఠ పెరగడంతో మ్యాచును ముందుగా ముగించేద్దామని భావించాడు. అయితే ప్రశాంతంగా ఆడటం ముఖ్యమని భావించిన ద్రవిడ్ డ్రస్సింగ్ రూమ్ నుంచి ఆగమేఘాలపై డగౌట్కు చేరుకున్నాడు.
అక్కడే కూర్చున్న రాహుల్ చాహర్తో ద్రవిడ్ మాట్లాడాడు. అప్పటికే 3 వికెట్లు తీసిన లెగ్స్పిన్నర్ హసరంగ ప్రమాదకరంగా బౌలింగ్ చేస్తున్నాడు. దాంతో అతడి బౌలింగ్లో షాట్లు ఆడొద్దని ద్రవిడ్ సూచించారు. 47వ ఓవర్లో దీపక్కు తిమ్మిర్లు రావడంతో ఫిజియోతో పాటు రాహుల్ చాహర్ అక్కడికి చేరుకొన్నాడు. ద్రవిడ్ సందేశాన్ని సోదరుడికి అందించాడు. ఆ తర్వాత హసరంగ వేసిన రెండు ఓవర్లలో టీమ్ఇండియా షాట్లు ఆడలేదు. మిగతా వాళ్ల బౌలింగ్లో పరుగులు రాబట్టి విజయం సాధించింది. ద్రవిడ్ డగౌట్లోకి వచ్చిన చిత్రాలు మాత్రం వైరల్ అయ్యాయి.