Rahul Dravid: టీమ్‌ఇండియా అభిమానులకు శుభవార్త.. ద్రవిడ్‌ అంగీకరించాడు!

టీమ్‌ఇండియా అభిమానులకు పెద్ద శుభవార్త అందింది. రాబోయే టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉండేందుకు ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించాడని తెలిసింది...

Updated : 16 Oct 2021 16:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా అభిమానులకు పెద్ద శుభవార్త అందింది. రాబోయే టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉండేందుకు ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించాడని తెలిసింది. గతరాత్రి దుబాయ్‌ వేదికగా చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సెక్రటరీ జైషా.. ద్రవిడ్‌ని కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారని సమాచారం. దీంతో వాళ్లిద్దరూ మాజీ సారథిని టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా ఉండేందుకు ఒప్పించారని ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి జాతీయ మీడియాకు తెలిపారు. ద్రవిడ్‌ 2023 వరకు రెండేళ్ల పాటు కోచ్‌గా ఉండటానికి అంగీకరించాడని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఎన్‌సీఏ హెడ్‌గా కొనసాగుతున్న ద్రవిడ్‌ త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటాడని, ఆ తర్వాత భారత జట్టు పగ్గాలు అందుకుంటాడని ఆ పత్రిక వివరించింది. అయితే, బౌలింగ్‌ కోచ్‌గా పరాస్‌ మామ్‌బ్రేను తీసుకుంటారని చెప్పింది. మరోవైపు బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాఠోడ్‌ కొనసాగే వీలుండగా.. ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్‌.శ్రీధర్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అందులో పేర్కొంది. కాగా, ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లు అండర్‌-19 స్థాయిలో ద్రవిడ్‌ పర్యవేక్షణలోనే మేటి ఆటగాళ్లుగా తయారైన సంగతి తెలిసిందే. దీంతో వారంతా ఇప్పుడు భారత జట్టులోనూ మెరుస్తున్నారు.

ఈ టీ20 ప్రపంచకప్‌ తర్వాత ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి కాంట్రాక్ట్‌ ముగుస్తున్న నేపథ్యంలో చాలా మంది ద్రవిడ్‌నే తర్వాతి కోచ్‌గా నియమించాలంటూ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే గంగూలీ, షా అతడిని ఒప్పించారని సమాచారం. మరోవైపు ద్రవిడ్‌ ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ టీమ్‌ఇండియా కోచ్‌గా సేవలందించిన సంగతి తెలిసిందే. అంతకుముందు అండర్‌-19 స్థాయిలో ఎంతో మంది యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని