Paralympics: దుమ్మురేపారు! ఒకే ఈవెంట్లో మనీశ్‌కు స్వర్ణం, అదానాకు రజతం

పారాలింపిక్స్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే అవనీ లేఖరా ఒక స్వర్ణం, ఒక కాంస్యం కైవసం చేసుకొంది..

Updated : 04 Sep 2021 11:10 IST

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే అవనీ లేఖరా ఒక స్వర్ణం, ఒక కాంస్యం కైవసం చేసుకొంది. తాజాగా మనీశ్‌ నర్వాల్‌ పసిడిని ముద్దాడగా సింఘ్‌రాజ్‌ అదానా రజతం అందుకున్నాడు. ప్రపంచకప్పుల్లో స్వర్ణాలు గెలిచి ఒలింపిక్స్‌లో సాధారణ షూటర్లు చేయలేనిది పారా షూటర్లు చేసి చూపిస్తున్నారు.

పీ1 పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 పోటీల్లో భారత్‌కు రెండు అత్యుత్తమ పతకాలు రావడం ప్రత్యేకం. 19 ఏళ్ల నర్వాల్‌ 218.2 స్కోరుతో పారాలింపిక్స్‌ రికార్డు సృష్టించి స్వర్ణం అందుకున్నాడు. ఇక అదానా 216.7 స్కోరుతో వెండి పతకం మెడలో వేసుకున్నాడు. రష్యా ఒలింపిక్‌ కమిటీ ఆటగాడు సెర్గీ మలెషెవ్‌ 196.8తో కాంస్యం గెలిచాడు.

అంతకు ముందు జరిగిన అర్హత పోటీల్లో అదానా 536 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచాడు. నర్వాల్‌ 533తో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరుకున్నాడు. తుది పోరులో మాత్రం నర్వాల్‌ దుమ్మురేపాడు. మరో ఆటగాడు ఆకాశ్‌ 27వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేదు.

ఎస్‌హెచ్‌1 పోటీల్లో ఒక కాలు, ఒక చేతి లేదా రెండు అవయవాల్లో వైకల్యం ఉన్నవారు పోటీపడతారు. అంటే కూర్చొని లేదా నిలబడి ఒకే చేత్తో పిస్టల్‌ పట్టుకొని షూట్‌ చేస్తారు. కాగా పీ4లో పోటీపడ్డవారు మిక్స్‌డ్‌ 50 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌ పోటీల్లోనూ తలపడతారు.











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని