IND vs NZ: కోహ్లీ అలా చెప్పడం ఓ బలహీన ప్రకటన

టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌-2లో టీమ్‌ఇండియా చాలా వెనుకబడి ఉంది. వరుసగా రెండు ఓటములు చవిచూడటంతో పాయింట్ల పట్టికలో నమీబియా కంటే దిగువకు చేరింది.

Published : 02 Nov 2021 08:50 IST

గెలవాలనే కసి, కోరిక అతడిలో ఉన్నాయని తెలుసు: కపిల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా గ్రూప్‌-2లో చాలా వెనుకబడి ఉంది. వరుసగా రెండు ఓటములు చవిచూడటంతో పాయింట్ల పట్టికలో నమీబియా కంటే దిగువకు చేరింది. మరోవైపు రన్‌రేట్‌ పరంగా అఫ్గానిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లు భారత్‌ కన్నా మెరుగ్గా ఉండటంతో కోహ్లీసేన మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా పెద్దగా ఉపయోగం లేనట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కివీస్‌తో మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాక పలువురు దిగ్గజ ఆటగాళ్లు జట్టు ప్రదర్శనపై తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారిలా..

* అది భారత్‌కు చాలా కష్టమైన రోజు. కానీ క్రికెట్లో ఇలాంటి రోజులు వస్తుంటాయి. ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. నిజాయతీగా చెప్పాలంటే.. మాట్లాడేందుకు ఏమీ లేదు. వచ్చే రోజుల్లో మన జట్టు గొప్పగా ఆడుతుందని ఆశిస్తున్నానంతే. న్యూజిలాండ్‌ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత్‌ ఎప్పుడూ వెనుకబడే ఉంది. మన బ్యాట్స్‌మెన్‌ చాలా ఇబ్బందిపడ్డారు. సింగిల్స్‌ తేలిగ్గా రాలేదు. దాంతో వాళ్లు భారీ షాట్ల కోసం ప్రయత్నించక తప్పలేదు. మన బౌలింగ్‌లో పదును లోపించింది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ ఏర్పాట్లు, బౌలింగ్‌ మార్పులు గొప్పగా ఉన్నాయి. పక్కా ప్రణాళికతో వచ్చి ఉంటాడు.     - సచిన్‌ తెందుల్కర్‌

* భారత జట్టు ప్రదర్శన నిరాశ కలిగించింది. న్యూజిలాండ్‌ గొప్పగా ఆడింది. భారత బ్యాట్స్‌మెన్‌ షాట్ల ఎంపిక పేలవం. గతంలో కొన్నిసార్లు చేసినట్లే న్యూజిలాండ్‌ ఈసారి కూడా భారత్‌ ముందంజ వేయకుండా దాదాపుగా చేయగలిగింది.     - వీరేంద్ర సెహ్వాగ్‌

* ఈ ఓటమి టీమ్‌ఇండియాను తీవ్రంగా బాధించేదే. మన జట్టు బ్యాటింగ్‌లో తడబడింది. వాళ్ల షాట్‌ సెలక్షన్‌ ప్రశ్నార్థకం. న్యూజిలాండ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. కానీ వాళ్ల పనిని భారత్‌ తేలిక చేసింది. నెట్‌ రన్‌రేట్‌ కూడా చాలా తక్కువగా ఉన్న భారత్‌ సెమీస్‌ చేరడం చాలా చాలా కష్టం.     - వీవీఎస్‌ లక్ష్మణ్‌

* ఇతర దేశాల నుంచి భారత్‌ కొంత నేర్చుకోవాలి. అనుభవం సంపాదించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా లీగులు ఆడేందుకు తమ ఆటగాళ్లను అనుమతించాలి.     - మైకేల్‌ వాన్‌

* సెమీఫైనల్‌కు అర్హత సాధించేందుకు భారత జట్టుకు ఇప్పటికీ చిన్న అవకాశముంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ ఆటను బట్టి చూస్తే.. ఆ జట్టు ముందంజ వేయాలంటే అద్భుతమే జరగాలి.     - షాహిద్‌ అఫ్రిది

* విరాట్‌ కోహ్లి లాంటి మేటి ఆటగాడు తమ జట్టులో ధైర్యం లోపించిందని చెప్పడం.. ఓ బలహీన ప్రకటన. గెలవాలనే కసి, కోరిక అతడిలో ఉన్నాయని మనకు తెలుసు. అతణ్ని నమ్మాం. ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్‌, కెప్టెన్‌ ఆలోచన సరళి ఇలా ఉంటే.. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఆటగాళ్లలో స్థైర్యాన్ని నింపడం కష్టం. జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపమని నా స్నేహితుడు రవిశాస్త్రితో పాటు ధోనీని అర్థిస్తున్నా. ఆటగాళ్లతో మాట్లాడి, వారిలో విశ్వాసాన్ని పెంచడం ధోని బాధ్యత. మనం బాగా ఆడడం ద్వారా సెమీఫైనల్‌ చేరాలి. ఇతర జట్లపై ఆశలు పెట్టుకోవడం సరి కాదు.     - కపిల్‌ దేవ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని