Team India: ఇది మన జట్టేనా?

14 ఏళ్ల క్రితం 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాల్లేకుండా అడుగుపెట్టి.. అద్భుతమైన ఆటతీరుతో పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచి సంచలనం సృష్టించిన జట్టు టీమ్‌ఇండియా. అప్పటి నుంచి తర్వాతి ప్రతి

Updated : 16 Nov 2021 15:23 IST

ఈనాడు క్రీడా విభాగం

14 ఏళ్ల క్రితం 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాల్లేకుండా అడుగుపెట్టి.. అద్భుతమైన ఆటతీరుతో పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచి సంచలనం సృష్టించిన జట్టు టీమ్‌ఇండియా. అప్పటి నుంచి తర్వాతి ప్రతి పొట్టి కప్పులోనూ భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఏదో ఒక దశలో వెనుదిరగడమే! ఇక ఈసారైనా కప్పు పట్టుకొస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఘోరాతి ఘోరమైన ప్రదర్శనతో సెమీస్‌ ఆరంభ దశలోనే చతికిలపడింది కోహ్లీసేన. గత రెండేళ్లుగా ప్రతికూల పరిస్థితుల్లోనూ గొప్పగా పోరాడి చరిత్రలో నిలిచిపోయే విజయాలు సాధించిన టీమ్‌ఇండియా ఇదేనా? ఆ తెగువ, ఆ పట్టుదల ఇప్పుడేమయ్యాయో?

2020-21 బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి.. ఘోర పరాభవం పాలయ్యాక వివిధ కారణాలతో కెప్టెన్‌ కోహ్లీతో సహా ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో.. అదీ ఆస్ట్రేలియా గడ్డపై..  మిగిలిన మూడు టెస్టుల్లో ఓ డ్రా, రెండు విజయాలతో సిరీస్‌ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది భారత్‌. ఈ ఏడాది ఆరంభంలో సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తోనూ తొలి టెస్టు ఓటమి తర్వాత బలంగా పుంజుకుని సిరీస్‌ దక్కించుకుంది. ఆపై ఇంగ్లాండ్‌ పర్యటనలో ప్రత్యర్థి సవాలును దాటి సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. అలాంటి జట్టుకు ఈ ప్రపంచకప్‌లో ఏమైంది? అప్పటి పోరాటం.. ఇప్పుడెందుకు లేదు? ఆటగాళ్లలో ఆ గెలవాలనే కసి ఏమైంది? ఇంత తేలిగ్గా ప్రత్యర్థులకు ఎలా తలవంచేస్తున్నారు? వ్యూహాలేమయ్యాయి? ఇప్పుడు అభిమానుల్ని తొలిచేస్తున్న ప్రశ్నలివే.


కుదరని కూర్పు..

ఈ ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు మొదటి నుంచి జట్టు కూర్పే ప్రధాన సమస్యగా మారింది. బౌలింగ్‌ చేయలేకపోతున్న హార్దిక్‌ను పాక్‌తో మ్యాచ్‌లో కేవలం బ్యాటర్‌గానే ఆడించిన భారత్‌కు ఆరో బౌలర్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ప్రత్యర్థి బ్యాటర్లు అలవోకగా పరుగులు రాబడుతుంటే వాళ్లను కట్టడి చేసే బౌలర్‌ లేక.. ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయింది. ఇక సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన కివీస్‌తో మ్యాచ్‌లో జట్టులో రెండు మార్పులు చేసినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. బ్యాటింగ్‌ ఆర్డర్లో జట్టు ఎందుకు మార్పులు చేసిందో అర్థం కావడం లేదు. ఇన్నింగ్స్‌ ఆరంభించేందుకు రోహిత్‌ను కాదని రాహుల్‌కు జతగా ఇషాన్‌ కిషాన్‌ను పంపించింది. బహుశా.. ఇంగ్లాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో ఓపెనర్లుగా ఇషాన్‌, రాహుల్‌ జోడీ ఉత్తమ ప్రదర్శన చేసిందనో, లేక ఇషాన్‌తో ఎదురు దాడి చేయించి కివీస్‌ను ఆత్మరక్షణలోకి నెడుదామనో ఈ ప్రయోగం చేశారేమో! కానీ అది బెడిసికొట్టింది. రోహిత్‌ మూడో స్థానంలో వచ్చినా ఏం లాభం లేకుండా పోయింది. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్‌ను కాదని శార్దూల్‌ను తీసుకున్నారు. శార్దూల్‌ ఒకే ఓవర్‌తో భారత్‌ ఓటమిని మరింత వేగవంతం చేశాడు. ఇక మరోసారి ఆరో బౌలర్‌ కోసం కొంతకాలంగా పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోతున్న హార్దిక్‌పైనే ఆధారపడ్డారు. పాక్‌తో మ్యాచ్‌లో ఏ మాయ చేయలేకపోయిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌.. కివీస్‌పైనా తేలిపోయాడు. జట్టుకు ప్రధాన స్పిన్‌ అస్త్రం అవుతాడని భావించిన అతను.. ఒక్క వికెట్టూ తీయలేకపోయాడు.


పిచ్‌ ప్రతికూలమే.. కానీ

ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరుగుతున్న యూఏఈలోని పిచ్‌లు మొదట బ్యాటింగ్‌కు కఠినంగా ఉంటున్నాయి. ముఖ్యంగా రాత్రి పూట మ్యాచ్‌ల్లో అయితే మంచు ప్రభావం కారణంగా ఛేదన చేసే జట్టుకే ఎక్కువ విజయాలు దక్కుతున్నాయి. భారత్‌తో మ్యాచ్‌ కలిపి ఇప్పటివరకూ సూపర్‌ 12 దశలో.. రాత్రి పూట తొమ్మిది మ్యాచ్‌లకు గాను ఎనిమిదింట్లో ఛేదన చేసిన జట్లదే విజయం. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ సులువుగా మారుతుండడంతో టాస్‌ గెలిచిన జట్లు మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌కే మొగ్గు చూపుతున్నాయి. బలమైన ఆస్ట్రేలియా కూడా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌లో ఎలా తడబడిందో చూశాం. టాస్‌ గెలిస్తే మ్యాచ్‌ గెలిచినట్లే అనే భావన ఏర్పడింది. అంతటి కీలకమైన టాస్‌ను ఓడిన భారత్‌.. మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. కానీ పిచ్‌ను, మంచు ప్రభావాన్ని, ప్రతికూల పరిస్థితులను సాకుగా చూపి భారత బ్యాటింగ్‌ను వెనకేసుకు రాలేం. గతేడాది పూర్తిగా, ఈ ఏడాది సగం ఐపీఎల్‌ను యూఏఈలోనే ఆడారు. అక్కడి పరిస్థితులు కఠినంగా ఉంటాయని ముందే తెలిసినా అందుకు తగ్గట్లు మన బ్యాటర్లు సిద్ధమవ్వలేదు. ఒక్కరూ క్రీజులో నిలబడే ప్రయత్నమే చేయలేదు. బంతి బ్యాట్‌ మీదికి రానపుడు లాఫ్టెడ్‌ షాట్లు ఆడటమెందుకు? క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నుపుడు వికెట్‌ కాపాడుకుంటూ గ్రౌండ్‌ షాట్లతో పరుగులు రాబట్టే ప్రయత్నం చేయొచ్చు కదా? అలా చేయలేదు.. ఒకరి తర్వాత ఒకరు భారీ షాట్లకు ప్రయత్నించి ఫీల్డర్లకు దొరికిపోయారు. ఇషాన్‌ పోతే రోహిత్‌ ఉన్నాడు కదా.. రాహుల్‌ ఔటైతేనేమీ కోహ్లి ఉన్నాడు కదా.. అని అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని అందరూ కలిసి వమ్ము చేశారు. చిన్న జట్లు కూడా సిక్సర్ల మోత మోగిస్తుంటే.. ఈ మ్యాచ్‌లో మన ఆటగాళ్లు ఫోర్లు రాబట్టేందుకూ ఆపసోపాలు పడ్డారు. సింగిల్స్‌, డబుల్స్‌తో స్ట్రైక్‌ రొటేట్‌ చేయలేక, గ్రౌండ్‌ షాట్లతో ఫోర్లు రాబట్టలేక.. అసహనంతో బంతిని గాల్లోకి లేపితే నేరుగా అది ఫీల్డర్ల చేతుల్లోనే పడింది. ఆటలో గెలుపోటములు సహజమే.. కానీ జట్టు ఓడిన తీరే తీవ్ర బాధను కలిగిస్తోంది.


‘‘చాలా ఆశ్చర్యంగా ఉంది. బ్యాట్‌తో కానీ.. బంతితో కానీ తెగించి ఆడలేకపోయాం. నిజానికి రక్షించుకునేంత స్కోరు చేయలేదు కానీ.. కనీసం పోరాడలేకపోయాం. భారత జట్టుకు ఆడుతుంటే భారీ అంచనాలుంటాయి. అంతేకాదు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. జట్టుగా ఆడి దీన్ని అధిగమించాలి. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో ఆ పని చేయలేకపోయాం. ఈ టోర్నీలో ఇంకా మ్యాచ్‌లు మిగిలున్నాయి. వాటిలోనైనా మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నాం’’

-కోహ్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని