
రెండో వన్డేకు అందుబాటులో సంజు
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియాకు శుభవార్త! శ్రీలంకతో రెండో వన్డేకు యువ ఆటగాడు సంజు శాంసన్ అందుబాటులో ఉంటాడని తెలిసింది. మోకాలి గాయం నుంచి అతడు కోలుకున్నాడని సమాచారం. ఇషాన్ కిషన్ అదరగొట్టిన వేళ అతడిని జట్టులోకి తీసుకుంటారా? మరికొంత విశ్రాంతినిస్తారా? చూడాల్సి ఉంది.
శ్రీలంకతో తొలి వన్డేకు తుది జట్టును చూసినప్పుడు అభిమానులు ఆశ్చర్యపోయారు. సంజు శాంసన్ను ఎందుకు ఆడించలేదని ప్రశ్నించారు. అతడు గాయపడటం వల్లే ఆడించలేదని తెలియడంతో శాంతించారు. అతడి స్థానంలో పుట్టినరోజు కుర్రాడు ఇషాన్ కిషన్ అరంగేట్రం చేశాడు. వికెట్ కీపింగ్తో పాటు దూకుడుగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కేవలం 42 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. 8 బౌండరీలు, 2 భారీ సిక్సర్లు దంచాడు.
సంజు శాంసన్ రెండో వన్డేకు అందుబాటులో ఉంటున్నాడని తెలియడంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘మోకాలి గాయం నుంచి సంజు కోలుకున్నాడని శ్రీలంక నుంచి వార్తలు అందడం సంతోషకరం. తిరువనంతపురం కుర్రాడు రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడు! ఆల్ ది బెస్ట్ సంజు!’ అని ట్వీట్ చేశారు. వీరిద్దరూ ఒకే నగరానికి చెందినవారు కావడం గమనార్హం.