
నిలకడగా ఆడుతున్న భారత్
అడిలైడ్: బోర్డర్-గావస్కర్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా ఆసీస్, భారత్ మధ్య అడిలైడ్లో జరుగుతున్న డేఅండ్నైట్ టెస్ట్ మ్యాచ్లో పరుగుల కోసం భారత్ బ్యాట్స్మన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆసీస్ పేసర్లు తమ పదునైన బంతులతో చెలరేగుతున్నారు. డిన్నర్ బ్రేక్ సమయానికి భారత్ 25 ఓవర్లలో 41/2 స్కోరు వద్ద ఉంది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, పుజారా ఉన్నారు. మ్యాచ్ తొలి ఓవర్ రెండో బంతికే ఆసీస్ పేసర్ స్టార్క్.. ఓపెనర్ పృథ్వీషా(0)ను క్లీన్బౌల్డ్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్(17), పుజారా(17 నాటౌట్)తో కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కమ్మిన్స్ వేసిన గుడ్లెంగ్త్ బంతికి మయాంక్ ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ(5*)కూడా నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించాడు. పుజారా చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆసీస్ పేసర్లు ముఖ్యంగా స్టార్క్, కమ్మిన్స్, హాజెల్వుడ్ గులాబి బంతి సీమ్ను ఉపయోగించుకుని నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం డిన్నర్ తర్వాత క్రీజులోకి వచ్చిన భారత బ్యాట్స్మన్ ఆసీస్ బౌలర్లను ఎలా ఎదుర్కుంటారో చూడాలి మరి.