Tokyo Paralympics: ఇది నా అత్యుత్తమ ప్రదర్శన కాదు.. ప్రపంచ రికార్డుపై సుమిత్‌ ఏమన్నాడంటే?

టోక్యో పారాలింపిక్స్‌లో పలుమార్లు ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పతకం సాధించినా.. అది తన అత్యుత్తమ ప్రదర్శన కాదని సుమిత్‌ అంటిల్‌ అంటున్నాడు. సోమవారం పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌-64 విభాగంలో 68.55 మీటర్లతో సుమిత్‌...

Published : 30 Aug 2021 23:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో పారాలింపిక్స్‌లో పలుమార్లు ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పతకం సాధించినా.. అది తన అత్యుత్తమ ప్రదర్శన కాదని సుమిత్‌ అంటిల్‌ అంటున్నాడు. సోమవారం పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌-64 విభాగంలో 68.55 మీటర్లతో సుమిత్‌ పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు పలుమార్లు తన ప్రపంచ రికార్డును తానే తిరగరాసి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇక పసిడి పతకం అందుకున్నాక మీడియాతో మాట్లాడిన అతడు.. ఇది తన మెరుగైన ప్రదర్శన కాదని, ఇంకా అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉందని చెప్పాడు.

తాను ఈటెను 70 మీటర్ల కన్నా ఎక్కువ దూరం విసురుతానని ఊహించానని, ఇంకా చెప్పాలంటే 75 మీటర్ల వరకు విసరగలనని సుమిత్‌ ఆశాభావం వ్యక్తంచేశాడు. ఇప్పుడు ఫైనల్లో సాధించిన రికార్డు తన అత్యుత్తమ ప్రదర్శన కాకపోయినా బంగారు పతకం గెలిచినందుకు సంతోషంగా ఉందన్నాడు. అయితే, భవిష్యత్‌లో మరింత అత్యద్భుత ప్రదర్శన చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఈ పసిడి గెలుపుతో తన కల సాకారమైందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని అన్నాడు. కాగా, ఈ పోటీల్లో సుమిత్‌ వరుసగా ఐదు సార్లు తన పాత రికార్డును తిరగరాశాడు. పారాలింపిక్స్‌కు ముందు అతడు 62.88 మీటర్ల మెరుగైన ప్రదర్శన చేయగా మార్చిలో దాన్ని రెండు సార్లు అధిగమించాడు. ఈ క్రమంలోనే ఇవాళ జరిగిన పారాలింపిక్స్‌ పోటీల్లో ఐదు ప్రయత్నాల్లో 66.95, 68.08, 65.27, 66.71, 68.55 ప్రదర్శన చేశాడు. దాంతో భారత్‌కు రెండో స్వర్ణ పతకం ఖాయం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని