Virat Kohli : ఆటలోనూ కింగే.. నాయకత్వంలోనూ తిరుగులేని రికార్డులే

టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసిన మూడేళ్లకే నాయకత్వం వహించే స్థాయికి...

Published : 17 Jan 2022 01:27 IST

టెస్టు ఫార్మాట్‌ కెప్టెన్‌గా వైదొలిగిన విరాట్

ఇంటర్నెట్ డెస్క్‌: టెస్టు జట్టులోకి అరంగేట్రం (2011) చేసిన మూడేళ్లకే నాయకత్వం వహించే స్థాయికి ఎదిగాడు. అత్యంత వేగంగా 23వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2014లో ఎంఎస్ ధోనీ గాయపడటంతో తొలిసారిగా సారథ్య బాధ్యతలను అందుకున్నాడు. అదీనూ ఆసీస్‌ గడ్డపై. విదేశాల్లో టెస్టు సిరీస్‌లను అందించిన విరాట్ కోహ్లీ తన చివరి సారథ్య బాధ్యతలకూ వీడ్కోలు పలికేశాడు. ఆటలోనూ, కెప్టెన్సీలోనూ దూకుడుగా ఉండే కోహ్లీ భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

  1. భారత టెస్టు జట్టు సారథిగా కోహ్లీ 68 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు.  అందులో 40 విజయాలు నమోదు కాగా.. 17 టెస్టుల్లో ఓటమి, మరో 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
  2. 145 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో కేవలం ముగ్గురు మాత్రమే విరాట్ కంటే కెప్టెన్‌గా అధిక విజయాలను నమోదు చేశారు. గ్రేమీ స్మిత్ (దక్షిణాఫ్రికా) 109 మ్యాచుల్లో 53 విజయాలు. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 77 మ్యాచుల్లో 48 విజయాలు. స్టీవ్‌ వా (ఆస్ట్రేలియా) 57 మ్యాచుల్లో 41 విజయాలు.
  3. ముఖ్యంగా తొలిసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆసీస్‌ గడ్డ మీదనే విరాట్ సిరీస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఇగ్లాండ్‌ మీద ఆధిక్యత ప్రదర్శించడం మరొక ఎత్తు. అయితే దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ విజయం సాధించాలనే కోరిక అలానే మిగిలిపోయింది.
  4. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో నాలుగు విదేశీ మైదానాల్లో టెస్టు విజయాలను నమోదు చేసిన అరుదైన ఘనతను కోహ్లీ రెండు సార్లు అందుకున్నాడు. గతేడాది  బ్రిస్బేన్, లార్డ్స్‌, ఓవల్‌, సెంచూరియన్‌ స్టేడియాల్లో విజయం సాధించగా.. 2018లో జోహెన్నెస్‌బర్గ్‌, నాటింగ్‌హామ్‌, అడిలైడ్, మెల్‌బోర్న్‌ మైదానాల్లో టీమ్‌ఇండియా గెలిచింది.
  5. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా (SENA ) జట్ల మీద ఎక్కువ విజయాలను నమోదు చేసిన ఆసియా ఖండానికి చెందిన సారథి కూడా విరాట్ కోహ్లీనే. 23 మ్యాచుల్లో ఏడు విజయాలను నమోదు చేయగా.. 13 పరాజయాలు, మూడు డ్రాగా ముగిశాయి.
  6. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌ మైదానంలో (2021-22) విజయం సాధించిన ఏకైక ఆసియా సారథి కోహ్లీ.. అంతేకాకుండా అంతర్జాతీయంగా మూడో కెప్టెన్‌. 2000వ సంవత్సరంలో ఇంగ్లాండ్‌ సారథి నాస్సర్ హుస్సేన్, 2014లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైకెల్ క్లార్క్‌ మాత్రమే అక్కడ విజయాలను నమోదు చేశారు. 
  7. దాదాపు 42 నెలల పాటు విరాట్ నాయకత్వంలోని టీమ్‌ఇండియా టెస్టు జట్టు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాగింది. అక్టోబర్‌ 2016 నుంచి మార్చి 2020 వరకు భారత్‌దే నంబర్‌ వన్‌ ర్యాంక్‌. ఆ తర్వాత కిందికి దిగజారినా.. ప్రస్తుతం కోహ్లీ గుడ్‌బై చెప్పే నాటికి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా మళ్లీ నంబర్‌వన్‌కు చేరుకుంది.
  8. విరాట్ నాయకత్వంలోని టీమ్‌ఇండియా తొలిసారి ఐసీసీ నిర్వహించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది. అయితే తుది పోరులో కివీస్‌ చేతిలో ఓటమిపాలైంది. క్లిష్టమైన విదేశీ పర్యటనల్లో విజయాలతో భారత్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చాడు.
  9. స్వదేశంలో అత్యధిక విజయాలను సాధించిన కెప్టెన్‌గానూ విరాట్ రికార్డు సృష్టించాడు. మన దేశంలో 24 టెస్టుల్లో, విదేశాల్లో 16 టెస్టు విజయాలతో గత సారథులకు అందనంత ఎత్తులో కోహ్లీ ఉన్నాడు.
  10. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 99 టెస్టుల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. బ్యాటింగ్‌లో 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. అందులో 27 శతకాలు, 28అర్ధశతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 254 నాటౌట్. ఇక టెస్టు కెప్టెన్‌గా 5,864 పరుగులు చేయడం విశేషం.
  11. టెస్టుల్లో కెప్టెన్‌గా ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లోని తొలి ఇన్నింగ్స్‌ల్లో శతకాలు నమోదు చేసిన ఏకైక క్రికెటర్‌ కోహ్లీనే.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని