Virat Kohli : టెస్టు క్రికెట్‌ నాయకత్వానికి విరాట్‌ కోహ్లీ గుడ్‌బై

భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. టెస్టు ఫార్మాట్‌ కెప్టెన్సీకి...

Published : 16 Jan 2022 03:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. టెస్టు ఫార్మాట్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. దీంతో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగినట్లు అయింది. ఇప్పటికే టీ20 కెప్టెన్సీ వదిలేసిన కోహ్లీని వన్డే నాయకత్వం నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. విరాట్ స్థానంలో రోహిత్‌శర్మను కెప్టెన్‌గా నియమించింది. కెప్టెన్సీకి వీడ్కోలు చెబుతూ విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. 

‘‘దాదాపు ఏడేళ్లపాటు సారథిగా జట్టును సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేశా. బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వర్తించా. ప్రతి దానికి ముగింపు అనేది ఉంటుంది. అది నా టెస్టు కెప్టెన్సీకి కూడానూ. ఇప్పటి వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను అనుభవించా. అయితే కృషి, నమ్మకం లేకుండా ఏ రోజూ ఆడలేదు. విజయం కోసం 120 శాతం కృషి చేశానని బలంగా నమ్ముతున్నా. జట్టు కోసం హృదయ పూర్వకంగా పనిచేశా. ఈ సందర్భంగా బీసీసీఐ, రవిశాస్త్రి, ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు చెప్పాలి. మరీ ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో నా మీద నమ్మకం ఉంచిన ఎంఎస్ ధోనీకి కృతజ్ఞతలు’’ అని విరాట్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఓడిపోవడంతో విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో వన్డే సారథ్యం సంబంధించి కోహ్లీ, బీసీసీఐ మధ్య చోటు చేసుకున్న కామెంట్లు కూడా కారణం అయిండొచ్చని అంచనా వేస్తున్నారు. 





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని