Cricket News: దాదా + ద్రవిడ్‌ = 318

అదే పనిగా బౌండరీలు బాదేస్తుంటే .. ప్రతి ఓవర్లో సిక్సర్లు కొట్టేస్తుంటే.. ఎదుర్కొన్న బౌలర్‌ను ఉతికి ఆరేస్తుంటే.. మీకు ఏమనిపిస్తుంది? ఇదేదో ఐపీఎల్‌ మ్యాచులో..

Updated : 26 May 2021 15:45 IST

1999 ప్రపంచకప్‌లో శ్రీలంకపై ఊచకోత గుర్తుందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అదే పనిగా బౌండరీలు బాదేస్తుంటే .. ప్రతి ఓవర్లో సిక్సర్లు కొట్టేస్తుంటే.. ఎదుర్కొన్న బౌలర్‌ను ఉతికి ఆరేస్తుంటే.. మీకు ఏమనిపిస్తుంది? ఇదేదో ఐపీఎల్‌ మ్యాచులో సన్నివేశంగా అనిపిస్తుంది. కానీ టీ20 క్రికెట్‌ రాకముందే.. ఐపీఎల్‌ అంటే తెలియని రోజుల్లోనే సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ ఆ మజా అందించారు. 1999లో మే 26న విధ్వంసం ఇలా ఉంటుందని ప్రత్యక్షంగా చూపించారు.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది శ్రీలంక. టాంటన్‌ వేదికగా టీమ్‌ఇండియా దాంతో తలపడింది. ప్రపంచకప్‌లో తన అత్యుత్తమ స్కోరైన 373ను సాధించింది. సౌరవ్‌ గంగూలీ (183; 158 బంతుల్లో 17×4, 7×6), రాహుల్‌ ద్రవిడ్‌ (145; 120 బంతుల్లో 17×4, 1×6) మెరుపులే అందుకు కారణం. టాస్‌ గెలవగానే లంక సారథి అర్జున రణతుంగ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే చమింద వాస్‌తో వికెట్లు తీయించే ప్రణాళిక వేశాడు. అందుకు తగ్గట్టే మొదటి ఓవర్లోనే దాదా ఓపెనింగ్‌ భాగస్వామి శఠగోపన్‌ రమేశ్‌ను వాస్‌ పెవిలియన్‌ పంపించాడు. కానీ అప్పుడే మొదలైంది అసలు ఆట. ద్రవిడ్‌, దాదా లంక బౌలింగ్‌ను చిత్తుగా కొట్టేశారు. 44.5 ఓవర్లలో 318 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డేల్లో ఇంత భారీ భాగస్వామ్యం సాధించడం అదే తొలిసారి.

ద్రవిడ్‌ తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడాడు. వరుసగా బౌండరీలు బాదేశాడు. అవన్నీ మైదానాన్ని ముద్దాడుతూ బౌండరీ సరిహద్దులు దాటేశాయి. బంతికో పరుగు చొప్పున మిస్టర్‌ డిపెండబుల్‌  ఆ ప్రపంచకప్‌లో రెండో సెంచరీ అందుకున్నాడు. మరోవైపు గంగూలీ వీర విహారం చేశాడు.  119 బంతుల్లో శతకం పూర్తి చేశాడు.  ఆ తర్వాత ముత్తయ్య మురళీధరన్‌, సనత్‌ జయసూర్యకు చుక్కలు చూపించాడు. కేవలం 39 బంతుల్లోనే మరో 83 పరుగులు చేసేశాడు. వికెట్‌పై తన బ్యాటుతో నాట్యం చేశాడు. భారత్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని లంక ఛేదించలేకపోయింది.  216కే కుప్పకూలింది. దాంతో టీమ్‌ఇండియా 157 పరుగుల తేడాతో విజయం అందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని