మీ పాత మొబైల్‌ నెంబరు వేరొకరికి ఇస్తే...

ఆ నెంబర్లు ముందు వాడిన వారికి చెందిన మెసేజ్‌లు, ఓటీపీలు, ఇతరత్రా సందేశాలు రావడం మొదలుపెట్టాయట

Published : 06 May 2021 21:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా రోజులుగా వాడని మొబైల్ నంబర్లను, రీఛార్జి చేయకుండా వదిలేసిన నంబర్లను రీసైకిల్‌ విధానంలో కొన్ని రోజుల తర్వాత కొత్తవాళ్లకు కేటాయిస్తుంటారు. ఎక్కువ మొబైల్‌ నెంబర్‌ సిరీస్‌లు అవ్వకుండా చూడటానికి మొబైల్‌ సంస్థలు అలా చేస్తుంటాయి. అయితే మొబైల్‌ నెట్‌వర్క్‌లు చేస్తున్న ఈ పని వినియోగదారుల్ని ఇబ్బందులకు గురి చేస్తోందట. వాడి, వదిలేసిన పాత మొబైల్స్‌ నెంబర్స్‌తో మీ వ్యక్తిగత సమాచారం వేరొకరికి చేరే అవకాశం కూడా ఉందట. 

యూఎస్‌లోని న్యూజెర్సీలో ఉన్న ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం ఇటీవల ఓ పరిశోధన నిర్వహించింది. అక్కడి పరిశోధకులు 200 రీసైకిల్డ్‌ (గతంలో ఒకరు వాడిన) నెంబర్లు తీసుకొని పరిశోధన చేశారు. వాటిలో 19 నెంబర్లతో ఈ తరహా సమస్య వచ్చిందట. ఆ నెంబర్లు గతంలో వాడిన వారికి చెందిన మెసేజ్‌లు, ఓటీపీలు, ఇతరత్రా సందేశాలు రావడం మొదలయింది. ఇలా ఒకరి నెంబర్లు... ఇంకొకరి ఇవ్వడం వల్ల సైబర్‌ దాడులూ జరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఆ నెంబరు సాయంతో అగంతుకులు వ్యక్తిగత సమాచారం సేకరించేలా ఫిషింగ్‌ చేయొచ్చట. దాంతోపాటు ఆ మొబైల్‌ నెంబరు సాయంతో తొలుత నెంబరు వాడిన వ్యక్తి సోషల్‌ మీడియా ఖాతాల సమాచారాన్ని సేకరించొచ్చట. మొబైల్‌ నెంబరుతో అనుసంధానం అయి ఉన్న ఖాతాల పాస్‌వర్డ్‌లను రిసెట్‌ చేసి.. దాని ద్వారా వ్యక్తిగత సమాచారం పొందొచ్చని  పరిశోధకులు చెబుతున్నారు.

పాత నెంబర్ల కేటాయింపు వ్యవహారం గురించి యూఎస్‌లోని వెరైజాన్‌, టీ మొబైల్‌ నెట్‌వర్క్‌లను ప్రిన్స్‌టన్‌ పరిశోధకుల బృందం సంప్రదించిందట. అయితే నెంబరు మార్చుకోవడానికి మొబైల్‌ సంస్థలు ఆన్‌లైన్‌ సౌకర్యం అందుబాటులోకి తెచ్చాయట. అంతే కానీ ఆ నెంబర్ల కేటాయింపు విధానం విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమస్య మన దేశంలోనూ ఉంది. అయితే ఈ ఇబ్బంది లేకుండా మొబైల్‌ నెంబరు మార్చినప్పుడు, పాత నెంబరు పోయి... మళ్లీ వెనక్కి తెచ్చుకోలేనప్పుడు యూజర్‌ కొన్ని పనులు చేయడం మంచింది. సోషల్‌ మీడియా ఖాతాల్లోని మొబైల్‌ నెంబర్లను మార్చాలి. దాంతోపాటు బ్యాంకు ఖాతాల్లో కూడా కొత్త నెంబర్‌ను అప్‌డేట్‌ చేయించాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పాత నెంబరు వేరొకరికి ఇచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని