British Rule: ఆంగ్లే‘యమలోకం’

ఈస్టిండియా కంపెనీ హయాంలోనే అండమాన్‌ దీవులను ఖైదీల వలస కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నించారు. ఇక్కడి వైపర్‌ దీవిని రాజకీయ ఖైదీల జైలుగా మార్చి... బహిరంగంగా ఉరి తీసేవారు కూడా.  1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయుల్లో

Updated : 06 Dec 2021 05:27 IST

బ్రిటిష్‌వారికి గరుడ పురాణం... అందులో చెప్పే నరకలోక శిక్షల గురించి తెలియకున్నా... భూమ్మీదే అలాంటి నరకాన్ని సృష్టించారు. అదే అండమాన్‌ సెల్యులర్‌ జైలు. కాలాపానీగా పేరొందిన ఈ కారాగారం స్వాతంత్య్రం కోరిన భారతీయుల కోసం తెల్లవారు కట్టించిన ఓ మృత్యులోగిలి! విప్లవవాదులకు, తమను ఎదిరించిన రాజకీయ ఖైదీలకిక్కడ నరకం చూపించి, మిగిలినవారిలోనూ భయభ్రాంతులు కల్పించారు.

అండమాన్‌లోని కాలాపానీ జైలు

స్టిండియా కంపెనీ హయాంలోనే అండమాన్‌ దీవులను ఖైదీల వలస కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నించారు. ఇక్కడి వైపర్‌ దీవిని రాజకీయ ఖైదీల జైలుగా మార్చి... బహిరంగంగా ఉరి తీసేవారు కూడా.  1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయుల్లో భయం నింపటానికి అత్యంత భయానక జైలును నిర్మించాలని బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. తమలోని క్రూరత్వాన్ని కాలాపానీ రూపంలో చూపించింది. తిరుగుబాటుదారులను, సమస్యాత్మక రాజకీయ ఖైదీలను ఇక్కడికి పంపించి నరకయాతన పెట్టేవారు. అనేకమంది ఆ బాధలు, కష్టాలు పడలేక కన్నుమూశారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక మతిభ్రమించిన వారెందరో!

సిపాయిల తిరుగుబాటు తర్వాత కొన్నాళ్లకు జైలర్‌ డేవిడ్‌బారీ, మేజర్‌ జేమ్స్‌ పాటిసన్‌ వాకర్‌ల ఆధ్వర్యంలో 200 మంది ఖైదీలను అండమాన్‌ దీవుల్లో దించింది బ్రిటిష్‌ ప్రభుత్వం. వారితోనే 1896లో సెల్యులర్‌ జైలు నిర్మాణం ఆరంభించారు. బర్మా నుంచి తెప్పించిన రాయితో... 693 గదులతో జైలును నిర్మించారు. 13 సంవత్సరాల పాటు కష్టించి... తాముండే జైలును తామే కట్టుకున్నారు ఖైదీలు. సైకిల్‌ చక్రానికుండే పుల్లల ఆకృతిలో వరుసలు వరుసలుగా, ఖైదీలు ఒకరికొకరు కన్పించకుండా దీన్ని కట్టారు. చిన్న కిటికీతో ప్రతి గది 4.5మీటర్ల పొడవు, 2.7మీటర్ల వెడల్పు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కో గది (సెల్‌) ఉంటుంది కాబట్టి దీనికి సెల్యులర్‌ అనే పేరు వచ్చింది.

జైలులో ఈ దాష్టీకాలను భరించలేక నిరాహార దీక్ష చేసినవారు కూడా లేకపోలేదు. అయితే... వీటిని బ్రిటిష్‌ జైలర్లు దారుణంగా అణచివేశారు. బలవంతంగా ఖైదీలను పట్టుకొని కట్టేసి... వారి గొంతుల్లోంచి గొట్టాల ద్వారా పాలు, గుడ్లు, కూరగాయలు పంపించేవారు. ఈ క్రమంలో ఊపిరితిత్తులు పాడై, అనారోగ్యంపాలై మరణించినవారెందరో. వీరందరినీ బండలకు కట్టి సముద్రంలో విసిరేసేవారు.

1935 తర్వాత జరిగిన రాజకీయ ఒప్పందాల ఫలితంగా... ఈ జైలులోని ఖైదీలను విడిచిపెట్టేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం అంగీకరించింది. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌ ఈ దీవులను స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో రెండు, స్వాతంత్య్రానంతరం మరో రెండు వరుసలను కూల్చేశారు. మిగిలిన వరుసలు, టవర్‌ను జాతీయ స్మారకచిహ్నంగా మార్చారు.


తాగేందుకు నీళ్లు అడిగితే..

సలే ఒంటరితనం. ఆపై దారుణమైన శిక్షలు. తమలోని విప్లవవాదం, జాతీయవాదం... రాజకీయంపై విరక్తి పుట్టేలా ఖైదీలను బాధించేవారు. బానిసలా పని చేయించేవారు. ఇంత పని చేయాలని కోటా పెట్టేవారు. మండే ఎండల్లో గంటల తరబడి పనిచేశాక... మంచి నీళ్లడిగితే మూత్రం పోసేవారు. ఎంతగా అలసిపోయినా విశ్రాంతి తీసుకోవటానికి లేదు. ఎవరైనా పనిలో బద్ధకిస్తున్నట్లు అనిపిస్తే దారుణంగా శిక్షించేవారు. జైలు గోడలకు, ఇనుప ఊచలకు, గుంజలకు బట్టలు ఆరవేసినట్లు రోజంతా వేలాడదీసేవారు. ఎప్పుడు పడితే అప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా లేదు. నిర్దేశించిన సమయాల్లో మాత్రమే వెళ్లాలి. గార్డు అనుమతివ్వకుంటే నిర్దేశిత సమయం అయ్యేదాకా ఆపుకోవాల్సిందే. నూనె గానుగలకు పశువులకు బదులు వీరినే కట్టి తిప్పేవారు. 1911 నుంచి 1921 దాకా ప్రముఖ స్వాతంత్య్రయోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ ఈ జైలులోనే శిక్ష అనుభవించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని