Nagaland: నాగాల నేలలో కాలకూటం!

నాగాలాండ్‌ వివాదం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా ఇది భారత నేలపై విషాన్ని చిమ్ముతూనే ఉంది. భారత్‌లో అత్యంత సుదీర్ఘ, రక్తసిక్త ఘర్షణగా ఇది నిలిచిపోయింది. దాడులు, ప్రతిదాడులు, శాంతి చర్చలు, కాల్పుల విరమణల నడుమ ఇది కశ్మీర్‌ వేర్పాటువాదం కన్నా ఎక్కువ కాలం రగిలింది.

Updated : 06 Dec 2021 05:05 IST

దశాబ్దాలుగా వివాదం.. తాజా కాల్పులతో మళ్లీ రచ్చ
ఈనాడు ప్రత్యేక విభాగం

సాయుధ దళాల చేతిలో శనివారం కాల్చివేతకు గురైన పౌరుల మృతదేహాల వద్ద బంధుమిత్రులు

నాగాలాండ్‌ వివాదం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా ఇది భారత నేలపై విషాన్ని చిమ్ముతూనే ఉంది. భారత్‌లో అత్యంత సుదీర్ఘ, రక్తసిక్త ఘర్షణగా ఇది నిలిచిపోయింది. దాడులు, ప్రతిదాడులు, శాంతి చర్చలు, కాల్పుల విరమణల నడుమ ఇది కశ్మీర్‌ వేర్పాటువాదం కన్నా ఎక్కువ కాలం రగిలింది. సంక్లిష్టమైన ఈ వివాదానికి బ్రిటిష్‌ హయాంలోనే బీజాలు పడ్డాయి. చైనా, పాకిస్థాన్‌ వంటి దేశాలు ఆజ్యం పోయడంతో ఈ అగ్నికీలలు ఆరడంలేదు. కొండలు, అడవులతో నిండిన భౌగోళిక ప్రాంతం, సరిహద్దులను ఆసరాగా చేసుకొని.. తీవ్రవాదులు భారత్‌లో దాడులు చేసి, మయన్మార్‌కు పరారవుతున్నారు. తాజాగా మాన్‌ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనతో నాగా వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. ఆ నెత్తుటి చారికల్ని తడిమిచూసుకునే పరిస్థితుల్ని కల్పించింది.

ఏమిటీ వివాదం?

1826లో బ్రిటిష్‌ ప్రభుత్వం అస్సాంను ఆక్రమించింది. 1881లో నాగాహిల్స్‌ కూడా బ్రిటిష్‌ ఇండియాలో భాగమైంది. దీన్ని నాగా తెగలు వ్యతిరేకించాయి. 1918లో ‘నాగా క్లబ్‌’ ఏర్పాటు ద్వారా తమ వ్యతిరేకతను తొలిసారిగా ప్రకటించాయి. తమ భవితవ్యాన్ని తేల్చుకునే హక్కు తమకే ఇవ్వాలని 1929లో సైమన్‌ కమిషన్‌ను ఈ క్లబ్‌ కోరింది. 1946లో నాగా నేషనల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎన్‌సీ) ఏర్పాటైంది. తమ తెగవారు నివసిస్తున్న ప్రాంతాలతో స్వతంత్ర నాగా దేశాన్ని స్థాపించాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది. 1947 ఆగస్టు 14న అంగమి జాపు ఫిజో నేతృత్వంలోని ఎన్‌ఎన్‌సీ స్వాతంత్య్రం కూడా ప్రకటించుకుంది.

సాయుధ ఉద్యమం

1952 మార్చి 22న ఫిజో.. నాగా ఫెడరల్‌ గవర్న్‌మెంట్‌ (ఎన్‌ఎఫ్‌జీ), నాగా ఫెడరల్‌ ఆర్మీ (ఎన్‌ఎఫ్‌ఏ) పేరుతో ముఠాలను ఏర్పాటుచేశారు. ఈ వేర్పాటువాదులు భారీగా హింసకు పాల్పడ్డారు. వీరిని అణచివేయడానికి భారత ప్రభుత్వం 1955లో సైన్యాన్ని పంపింది. 1958లో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తెచ్చింది. అప్పట్నుంచి ఈ చట్టంపై వివాదం రగులుతూనే ఉంది. దీన్ని రద్దుచేయాలని వేర్పాటువాద గ్రూపులు ఉద్యమిస్తూనే ఉన్నాయి.

నాడే శాంతి ప్రక్రియ

1947 జూన్‌ 29న నాటి అస్సాం గవర్నర్‌ అక్బర్‌ హైదరీ.. మధ్యవర్తులతో 9 సూత్రాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీన్ని ఫిజో తిరస్కరించారు. అస్సాంలోని నాగా హిల్స్‌ జిల్లాను 1963లో నాగాలాండ్‌ పేరుతో ప్రత్యేక రాష్ట్రంగా కేంద్రం ఏర్పాటు చేసింది. ఎన్‌ఈఎఫ్‌ఏలో భాగంగా ఉన్న టువెన్‌సాంగ్‌ ప్రాంతాన్నీ దీనికి జోడించింది. ఆ మరుసటి సంవత్సరం ఏప్రిల్‌లో ఒక శాంతి మిషన్‌ను ఏర్పాటు చేసింది. అదే ఏడాది సెప్టెంబరులో సైనిక చర్యలు ఆపేసేలా ఎన్‌ఎన్‌సీ, ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఎన్‌ఎన్‌సీ/ఎన్‌ఎఫ్‌జీ/ఎన్‌ఎఫ్‌ఏ హింసాత్మక కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆరు విడతలుగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో 1967లో శాంతి మిషన్‌కు స్వస్తి పలికారు. అనంతరం తీవ్రవాదుల వేటకు సైనిక చర్య ప్రారంభమైంది.

ఎన్‌ఎస్‌సీఎన్‌ ఆరంభం

1975 నవంబరులో.. ఎన్‌ఎన్‌సీలోని ఒక వర్గంతో ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని ‘షిల్లాంగ్‌ ఒప్పందం’గా పిలుస్తున్నారు. దీనికింద ఎన్‌ఎన్‌సీ, ఎన్‌ఎఫ్‌జీలోని సంబంధిత వర్గం వారు ఆయుధాలు విడిచిపెట్టడానికి అంగీకరించారు. అయితే థయింగ్‌లాంగ్‌ ముయివా నేతృత్వంలోని 140 మంది సభ్యులు ఈ ఒప్పందాన్ని తిరస్కరించారు. వీరంతా ఆ సమయంలో చైనాలో ఉన్నారు. 1980లో వీరు నేషనలిస్ట్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌)ను ఏర్పాటు చేశారు. ముయివాతో ఇసాక్‌ చిషి షూ, ఎస్‌.ఎస్‌.ఖప్లాంగ్‌లు చేతులు కలిపారు. 1988లో ఒక హింసాత్మక ఘటన అనంతరం ఎన్‌ఎస్‌సీఎన్‌లో చీలిక వచ్చింది. అది ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఇసాక్‌-ముయివా..ఐఎం), ఎన్‌ఎస్‌సీఎన్‌ (కప్లాంగ్‌..కె)లుగా విడిపోయాయి. ఇదే సమయంలో ఎన్‌ఎన్‌సీ ప్రభ తగ్గడం మొదలైంది. 1991లో ఫిజో చనిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని తీవ్రవాదానికి ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐఎం) కేంద్ర బిందువుగా నిలిచింది.

ఏమిటీ డిమాండ్లు

నాగాలాండ్‌తో పాటు పొరుగునున్న రాష్ట్రాలతోపాటు మయన్మార్‌లోని నాగాలు అధికంగా ఉన్న జిల్లాలతో కలిపి ‘గ్రేటర్‌ నాగాలిమ్‌’ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. దాని విస్తీర్ణం 1,20,000 చదరపు కిలోమీటర్లుగా ప్రతిపాదిస్తోంది. ప్రస్తుత నాగాలాండ్‌ విస్తీర్ణం 16,527 చదరపు కిలోమీటర్లే కావడం ఇక్కడ ప్రస్తావనార్హం. ‘గ్రేటర్‌’ డిమాండ్‌ను అస్సాం, మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. నాగా ప్రాబల్యమున్న ప్రాంతాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ‘గ్రేటర్‌ నాగాలిమ్‌’ను ఏర్పాటు చేయాలని నాగాలాండ్‌ అసెంబ్లీ.. ఐదుసార్లు తీర్మానం చేసింది.

1995 జూన్‌ 15న నాటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు పారిస్‌లో ముయివా తదితర నాగా నేతలను కలిశారు. ఆ తర్వాత వారితో ప్రభుత్వం వరుసగా అనేక భేటీలు నిర్వహించింది. 1998 సెప్టెంబరు 30న నాటి ప్రధాన మంత్రి వాజ్‌పేయీ పారిస్‌లో ఆ ముఠాల నేతలతో సమావేశమయ్యారు. 1997 జులై 25న భారత ప్రభుత్వానికి ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐఎం)కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సర్కారు దీన్ని కొనసాగించింది. 2015లో ప్రభుత్వానికి ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐఎం)కు మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. నాటి నాగాలాండ్‌ గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవిని మధ్యవర్తిగా నియమించింది. ఆ తర్వాత చర్చల తీరుతెన్నులపై అస్పష్టత నెలకొంది. చర్చల మధ్యవర్తిగా రవి ఇటీవల ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. దీంతో వివాదం ఇంకా రగులుతూనే ఉంది. సరిహద్దు రాష్ట్రంలో నెత్తురు చిందుతూనే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని