Corona: మార్కెట్లలో పెరిగిన రద్దీ

మొన్నటివరకు బోసిపోయిన రహదారుల్లో ట్రాఫిక్‌ పెరుగుతోంది.. బస్సులు, రైళ్లు మళ్లీ కిటకిటలాడుతున్నాయి.. దుకాణాల వద్ద సందడి పెరుగుతోంది. మద్యం కోసం ఎగబడుతున్న మందుబాబులు.. కూరగాయలు, చేపల మార్కెట్లలో గుంపులుగుంపులుగా జనం.. మూడో వేవ్‌ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ఆ భయం కనిపించడం లేదు.

Updated : 17 Jun 2021 08:27 IST

మళ్లీ అదే అజాగ్రత్త
లాక్‌డౌన్‌ వెసులుబాటుతో భారీగా జనం బయటకు
మార్కెట్లు, దుకాణాల వద్ద గుంపులుగుంపులు
వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణం
కానరాని మాస్కులు, భౌతికదూరం
ఈనాడు - హైదరాబాద్‌

మొన్నటివరకు బోసిపోయిన రహదారుల్లో ట్రాఫిక్‌ పెరుగుతోంది.. బస్సులు, రైళ్లు మళ్లీ కిటకిటలాడుతున్నాయి.. దుకాణాల వద్ద సందడి పెరుగుతోంది. మద్యం కోసం ఎగబడుతున్న మందుబాబులు.. కూరగాయలు, చేపల మార్కెట్లలో గుంపులుగుంపులుగా జనం.. మూడో వేవ్‌ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ఆ భయం కనిపించడం లేదు. చిన్నచిన్న దుకాణాల వద్ద సైతం ఒకేసారి పదుల సంఖ్యలో కొనుగోలుదారులు కనిపిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనల ఊసే లేదు. మాస్కుల వినియోగమూ తగ్గిపోతోంది. కాస్తంత శాంతించిన కొవిడ్‌ మహమ్మారి ఈ అజాగ్రత్తలతో మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని అధికారులు, వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టేందుకు, సామాన్యుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి పగటివేళ మినహాయింపు ఇచ్చింది. అవసరాల మేరకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తే ప్రజలకు క్షేమకరం. కానీ ఇందుకు భిన్నంగా జరుగుతోంది. జాగ్రత్తలు పాటించకుండానే చాలా మంది జనం బయట తిరుగుతున్నారు.

ఎందుకీ పరిస్థితి?
*కొవిడ్‌ తొలినాళ్లలో జనం దూరం పాటించేందుకు వీలుగా దుకాణాలు, మార్కెట్ల వద్ద వృత్తాలు గీసేవారు. ఇప్పుడు అవేవీ లేవు. రెండోదశలో తొలి విడత కంటే కేసులు, మరణాలు పెరిగాయి. కొద్దిరోజులుగా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టడంతో జనంలో ఉదాసీనత పెరిగిపోయింది.
* సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్ల నుంచి విశాఖపట్నం వైపు నిత్యం 10 ప్రత్యేక రైళ్లలో మూడింటిని రద్దు చేయగా, ఏడు తిరుగుతున్నాయి. వీటిలో గరీబ్‌రథ్‌, మరో ఏసీ రైలుకు మాత్రమే టికెట్లు దొరుకుతున్నాయి. మిగిలిన అయిదు రైళ్లలో బెర్తులకు అదనంగా ఆర్‌ఏసీ టికెట్లతో పరిమితికి మించిన ప్రయాణికులుంటున్నారు. ప్రతిరోజు ఈ రైళ్లలో వెయిటింగ్‌లిస్టు కనిపిస్తోంది.
* మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌లోని 9 డిపోల్లో 894 బస్సులుటే కొవిడ్‌ రెండోవిడత ఉద్ధృతితో 402 బస్సులనే తిప్పుతున్నారు. ఆక్యుపెన్సీ రేషియో గతంలో ఎప్పుడూ 70 శాతం చేరలేదు. ఇప్పుడు ఏకంగా 80 శాతం ఓఆర్‌తో కిక్కిసిరిన బస్సుల్ని నడిపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని