Pakistan: పాక్‌ ముక్కుపిండి పరిహారం వసూలు చేసిన చైనా..!

చైనాలో దాసు  హైడ్రోపవర్‌ డ్యామ్‌ వద్ద జరిగిన పేలుడుకు సంబంధించి నష్ట పరిహారాన్ని చైనా ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఈ ఘటనలో 36 మంది చైనా కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Published : 24 Jan 2022 02:05 IST

 ఒక్కో ప్రాణానికి రూ.2.3 కోట్లు

 

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌-చైనాలు తమ బంధాన్ని ‘ఐరన్‌ బ్రదర్స్‌ బంధం’గా చెప్పుకొంటాయి. కానీ, సొమ్ము విషయానికి వస్తే మాత్రం చైనా ఎక్కడా తగ్గదు. పాక్‌లో దాసు  హైడ్రోపవర్‌ డ్యామ్‌ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి సంబంధించి నష్ట పరిహారాన్ని చైనా ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఈ దాడిలో 36 మంది చైనా కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 2021 జులై 14వ తేదీన చైనా పాకిస్థాన్‌లో దాసు హైడ్రోపవర్‌ డ్యామ్‌ నిర్మాణ పనుల వద్ద భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో మొత్తం 36 మంది చైనా కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో బీజింగ్‌ రంగంలోకి దిగింది.. ప్రాణాలు కోల్పోయిన తమ కార్మికుల కుటుంబాలకు 38 మిలియన్‌ డాలర్ల (రూ.282 కోట్లు) పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసింది. చైనాలో ఉగ్రదాడిలో మరణిస్తే అక్కడి ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఇది దాదాపు రెట్టింపు మొత్తం.

అసలే పాకిస్థాన్‌లో పాలన నడపడానికే సొమ్ములు లేవు.. ఇక చైనాకు ఎక్కడి నుంచి తెచ్చిఇస్తుంది. ఈ మొత్తం ఇచ్చేందుకు పాక్‌ మొండికేసింది. దీంతో చైనా కాంట్రాక్టర్‌ దాసు డ్యామ్‌ పనులను అర్ధంతరంగా నిలిపివేశాడు. మళ్లీ పనులు మొదలుపెట్టాలంటే పలు డిమాండ్లు, నిబంధనలను పూర్తి చేయాలని మొండికేసి కూర్చున్నాడు.

ప్రపంచ బ్యాంక్‌ సహకారంతో దాసు హైడ్రోపవర్‌ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. ఇది చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌(సీపెక్‌)లో భాగం కాదు. కానీ, చైనా నిర్మాణరంగ సంస్థ జెగ్‌హుబా కంపెనీ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2015లో ప్రారంభించారు. కానీ, ఆత్మాహుతి దాడి ఘటన తర్వాత పనులు నిలిపివేశారు.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ది ఎకనామిక్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ, పాక్‌ ఆర్థిక మంత్రి షౌకత్‌ తారిన్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా చైనా జాతీయులకు 11.6 మిలియన్‌ డాలర్లు (రూ.86.32 కోట్లు) చెల్లించాలని నిర్ణయం తీసుకొంది. మరోపక్క అదే చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ మీడియా ముందుకొచ్చి దాసు డ్యామ్‌ పనులు నిలిపివేతపై స్పందించారు. కాంట్రాక్టరు డిమాండ్లు చేస్తున్న విషయం తన దృష్టికి రాలేదని.. డ్యామ్‌ పనులు మళ్లీ మొదలయ్యాయని వెల్లడించారు. 

తొలుత భారత్‌పై బురద చల్లే యత్నం..

గత జులైలో ఈ ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో పాక్‌ దీని తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రయత్నించింది. తొలుత ఇదో ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ, చైనా సర్కారుకు చెందిన దర్యాప్తు బృందం నేరుగా ఘటనా స్థలాన్ని సందర్శించి.. ఆత్మాహుతి దాడిగా తేల్చింది. ఆ తర్వాత కూడా పాక్‌ మరోసారి తప్పించుకొనేందుకు ఈ దాడి బాధ్యతను భారత నిఘా సంస్థ ‘రా’పై మోపేందుకు ప్రయత్నించింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షామహమూద్‌ ఖురేషీ ఓ సందర్భంలో మాట్లాడుతూ భారత్‌, అఫ్గాన్‌ నిఘా వర్గాలు ఈ దాడి వెనుకాల  ఉన్నాయని ఆరోపించారు. ఎటువంటి ఆధారాలను చూపించలేకపోయారు. ఆ తర్వాత పాకిస్థాన్‌ తాలిబన్ల హస్తం ఉన్నట్లు తేలింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని